టీ20 ప్రపంచకప్లో వాళ్లిద్దరు అదరగొడతారు : రికీ పాంటింగ్
టీ20 ప్రపంచకప్లో టాప్ వికెట్ టేకర్గా బుమ్రా, హయ్యెస్ట్ రన్ స్కోరర్గా ట్రావిస్ హెడ్ నిలుస్తారని ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పాడు.
దిశ, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్లో టాప్ వికెట్ టేకర్గా భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, హయ్యెస్ట్ రన్ స్కోరర్గా ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ నిలుస్తారని ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో బుమ్రా(ముంబై ఇండియన్స్), హెడ్(సన్రైజర్స్ హైదరాబాద్) సత్తాచాటిన విషయం తెలిసిందే. బుమ్రా 13 మ్యాచ్ల్లో 6.48 ఎకానమీతో 20 వికెట్లు పడగొట్టాడు. సంచలన బ్యాటింగ్ చేసిన హెడ్ 567 స్కోర్తో టాప్ రన్స్కోరర్ల జాబితాలో 4వ స్థానంలో నిలిచాడు. ఈ నేపథ్యంలోనే టీ20 వరల్డ్ కప్లోనూ వీరు అదరగొడుతారని పాంటింగ్ చెప్పాడు.
తాజాగా ఐసీసీ రివ్యూలో పాంటింగ్ మాట్లాడుతూ..‘నా అంచనా ప్రకారం బుమ్రా లీడింగ్ వికెట్ టేకర్గా నిలుస్తాడు. కొన్నేళ్లుగా అతను అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్లోనూ సత్తాచాటాడు. కొత్త బాల్తో స్వింగ్ చేయగలడు. వేగంగానూ వేయగలడు. ఇటీవల ఐపీఎల్లో అతని ఎకానమీ రేట్ గమనిస్తే ఓవర్లో 7 కంటే తక్కువే పరుగులే ఇచ్చాడు. అతని కఠిన ఓవర్లు ఎక్కువగా వేయగలడు. టీ20 క్రికెట్లో కఠిన ఓవర్లు వేయడం వల్ల ఎక్కువగా వికెట్లు తీసే అవకాశం ఉంటుంది.’ అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
అలాగే, హెడ్ గురించి మాట్లాడుతూ.. అతనికి వైట్బాల్, రెడ్బాల్ అనే తేడా లేదని, అతను నిర్భయంగా ఆడతాడని వ్యాఖ్యానించాడు. ‘టోర్నీలో అతను నిలకడగా ఆడకపోవచ్చు. కానీ, టాప్ రన్స్కోరర్గా నిలుస్తాడు. అతను ఎక్కువ సేపు క్రీజులో ఉంటే జట్టును గెలిపిస్తాడు.’ అని తెలిపాడు.