అది మాకు చాలా కీలకం : రోహిత్ శర్మ
టీ20 వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియా సన్నద్ధమవుతోంది. భారత్ తన గ్రూపు మ్యాచ్లన్నీ అమెరికాలోనే ఆడనుంది.
దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియా సన్నద్ధమవుతోంది. భారత్ తన గ్రూపు మ్యాచ్లన్నీ అమెరికాలోనే ఆడనుంది. వచ్చే నెల 5న న్యూయార్క్ వేదికగా టీమ్ ఇండియా తన తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో తలపడనుంది. అంతకుముందు అదే స్టేడియంలో శనివారం బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్కు ముందు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీతో మాట్లాడుతూ.. వార్మప్ మ్యాచ్ కూడా తమకు చాలా కీలకమన్నాడు.
పొట్టి ప్రపంచకప్కు ముందు పిచ్, పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఈ మ్యాచ్ను ఉపయోగించుకుంటామని చెప్పాడు. ‘మేము ఇక్కడ ఆడటం ఇదే తొలిసారి. వేదిక చాలా బాగుంది. ఓపెన్ గ్రౌండ్. ఈ స్టేడియంలో ఆటను ఆస్వాదించడానికి ఎదురుచూస్తున్నాను. ఇంతకుముందు మేము ఇక్కడ ఆడలేదు. జూన్ 5న మేము తొలి మ్యాచ్ ఆడబోతున్నాం. టోర్నీ ప్రారంభానికి ముందే ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటు పడాలి. పిచ్ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకు వార్మప్ మ్యాచ్ను సద్వినియోగం చేసుకుంటాం. ఇక్కడ తొలిసారిగా వరల్డ్ కప్ జరుగుతుంది. కాబట్టి, అభిమానులు ఆసక్తి చూపుతారని అనుకుంటున్నా.’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.