T20 World Cup : ఫైనల్‌కు వర్షం ముప్పు.. రద్దైతే విజేత ఎవరు?.. ఎలా నిర్ణయిస్తారు?

టీ20 ప్రపంచకప్‌లో మహా సమరానికి సమయం ఆసన్నమైంది. రేపు భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది.

Update: 2024-06-28 13:39 GMT

దిశ, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్‌లో మహా సమరానికి సమయం ఆసన్నమైంది. రేపు భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. ఐసీసీ టైటిల్ నిరీక్షణకు తెరదించాలని రోహిత్ సేన పంతంతో ఉండగా.. మరోవైపు, తొలి ఐసీసీ కప్పు గెలవాలని సౌతాఫ్రికా ఉవ్విళ్లూరుతున్నది. ఇరు జట్లు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడలేదు. అజేయంగా ఫైనల్‌కు దూసుకొచ్చాయి. దీంతో ఫైనల్‌పై అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అయితే, ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే విజేతను ఎలా నిర్ణయిస్తారు?.. నిబంధనలు ఎలా ఉన్నాయి? తెలుసుకుందాం..

ఫైనల్ జరిగే బార్బడోస్‌లో శనివారం 75 శాతం వర్ష పడే సూచనలు ఉన్నట్టు అక్కడి వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి. స్థానిక కాల మానం ప్రకారం.. బార్బడోస్‌లో ఉదయం 10:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. అంతకుముందు నుంచే అక్కడ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. దీంతో మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే, వర్షం కారణంగా లేదా ఏదైనా కారణంతో మ్యాచ్ ఆలస్యమైతే మ్యాచ్ పూర్తి చేయడానికి అదనంగా 190 నిమిషాలు కేటాయించారు. వర్షం అంతరాయంతో ముందుగానే డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధతిలో ఫలితం తేల్చాలంటే..ఇరు జ‌ట్లు క‌నీసం 10 ఓవ‌ర్ల చొప్పున అయిన బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.

ఒకవేళ ఇరు జట్లు 10 ఓవర్ల చొప్పున బ్యాటింగ్ చేయలేకపోతే మ్యాచ్‌ను రిజర్వ్‌ డేకు మార్చుతారు. ఫైనల్‌కు ఆదివారం రిజర్వ్ డేగా కేటాయించారు. అయితే, రిజర్వ్ డే నిబంధనల ప్రకారం ఆదివారం మ్యాచ్‌ను నిర్వహిస్తారు. టాస్ పడకపోతే రిజర్వ్ డేనే టాస్ వేసి మ్యాచ్‌ను ప్రారంభిస్తారు. టాస్ పడి మ్యాచ్ మధ్యలో ఆగిపోతే అక్కడి నుంచే కొనసాగిస్తారు. ఆదివారం కూడా బార్బడోస్‌లో వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. రిజర్వ్ డే కూడా మ్యాచ్ జరగకపోతే నో రిజల్ట్‌గా పరిగణించి భారత్, సౌతాఫ్రికాలను ఉమ్మడి విజేతగా ప్రకటిస్తారు. 

Similar News