10 ఏళ్లలో ఎన్నో వైఫల్యాలు చూశా : ఎమోషనల్ అయిన శాంసన్
10 ఏళ్లలో ఎన్నో వైఫల్యాలు చూశానని టీమ్ ఇండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ వ్యాఖ్యానించాడు.
దిశ, స్పోర్ట్స్ : 10 ఏళ్లలో ఎన్నో వైఫల్యాలు చూశానని టీమ్ ఇండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్-17లో శాంసన్ సత్తాచాటిన విషయం తెలిసిందే. 15 ఇన్నింగ్స్ల్లో 531 పరుగులు చేశాడు. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న అతను.. ఈ నెల 5న ఐర్లాండ్తో జరిగే తొలి మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్నాడు. తాజాగా బీసీసీఐతో శాంసన్ మాట్లాడుతూ.. ‘ప్రపంచకప్ కోసం చాలా సన్నద్ధమయ్యా. 10 ఏళ్లలో ఎన్నో వైఫల్యాలు చూశా. కొన్నే విజయాలు దక్కాయి. ఈ ప్రపంచకప్కు ముందు జీవితం, క్రికెట్ నాకు అన్నీ నేర్పించాయి. ఐపీఎల్ ఆడుతున్నప్పుడు నా మైండ్ మొత్తం అదే ఉన్నా.. ప్రపంచకప్ సెలెక్షన్ గురించి కూడా ఆలోచించా. ప్రపంచకప్కు ఎంపికవ్వడం చాలా పెద్ద విషయం. ఐపీఎల్లో రాణిస్తే ప్రపంచకప్కు సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నాకు తెలుసు. కానీ, అంత సులభమైనది కాదు. జట్టుకు ఏం కావాలో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. సంజూ నువ్వు సిద్ధంగా ఉన్నావని నేను నమ్మిన క్షణం నాకు జీవితాన్ని, క్రికెట్ను తిరిగి ఇచ్చింది.’అని చెప్పుకొచ్చాడు. కాగా, బంగ్లాదేశ్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో శాంసన్ నిరాశపరిచిన విషయం తెలిసిందే. వికెట్ కీపర్ రోల్ కోసం పంత్ ముందు వరుసలో ఉండగా.. శాంసన్ చోటుపై అనుమానాలు నెలకొన్నాయి. మరి, అతనికి తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో చూడాలి.