వరల్డ్ కప్ ఎక్కడ జరిగినా వెళ్లాల్సిందే : పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్
ఈ ఏడాదిలో భారత్లో జరిగే వన్డే వరల్డ్ కప్లో పాకిస్తాన్ జట్టు పాల్గొనడంపై ఇంకా స్పష్టత రాలేదు.
కరాచీ : ఈ ఏడాదిలో భారత్లో జరిగే వన్డే వరల్డ్ కప్లో పాకిస్తాన్ జట్టు పాల్గొనడంపై ఇంకా స్పష్టత రాలేదు. తాజాగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ చేసిన వ్యాఖ్యలతో ప్రపంచకప్లో పాక్ పాల్గొనడం ఖాయమే అని తెలుస్తుంది. గురువారం కరాచీలో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్తో బాబర్ మాట్లాడుతూ.. ప్రపంచకప్ ఎక్కడ జరిగినా ఆడాల్సిందేనని తెలిపాడు. సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉత్సాహంగా ఉన్నామని చెప్పాడు.
‘వరల్డ్ కప్లో మేము టీమ్ ఇండియాతో ఆడటం గురించి మాత్రమే ఆలోచించడం లేదు. ఐసీసీ టైటిల్ గెలిచేందుకు ప్రతి మ్యాచ్లో రాణించాలని చూస్తున్నాం.’ అని తెలిపాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)లో ఏం జరుగుతుందో దానిపై తాము దృష్టి పెట్టడంలేదని, ఆటపై మాత్రమ తమ ఫోకస్ ఉందని చెప్పాడు. కాగా, వరల్డ్ కప్లో అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా, భారత్లో పర్యటించడంపై అనుమతి కోరుతూ పీసీబీ పాక్ ప్రభుత్వానికి లేఖ రాయగా.. దానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.