ICC World Cup 2023: వరల్డ్ కప్ వేదికలపై వివాదం.. బీసీసీఐ క్లారిటీ
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న వన్డే వరల్డ్కప్కు సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ రిలీజ్ చేసింది.
దిశ, వెబ్డెస్క్: భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న వన్డే వరల్డ్కప్కు సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ రిలీజ్ చేసింది. మొత్తం 48 మ్యాచ్లు జరగనుంది. అందులో 45 లీగ్ దశలో.. మరో మూడు నాకౌట్ మ్యాచ్లు(రెండు సెమీఫైనల్స్, ఒక ఫైనల్) ఉన్నాయి. కాగా ఈ మ్యాచ్లకు పది వేదికలను ఖరారు చేసిన బీసీసీఐ.. వార్మప్ మ్యాచ్లకు మరో రెండు స్టేడియాలను (త్రివేండం, గుహవాటి) ఎంపిక చేసింది. ముఖ్యంగా మోహాలి వేదికను ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీంతో ఈ స్టేడియాన్ని ఎంపిక చేయకపోవడంపై పంజాబ్ క్రీడా మంత్రి గుర్మీత్ సింగ్ విమర్శించారు. రాజకీయ జోక్యం వల్లే మోహాలీని పక్కన పెట్టారని ఆరోపించారు. బీసీసీఐ వద్ద ఈ అంశం లేవనెత్తుతామని గుర్మీత్ సింగ్ ప్రకటించారు. అహ్మదాబాద్ వేదికకు లబ్ధి చేసేందుకే మోహాలీని పక్కన పెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ సైతం విమర్శించారు.
ఈ నేపథ్యంలో విమర్శలపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. ''ప్రపంచ కప్ కోసం తొలిసారి 12 వేదికలను ఎంపిక చేశాం. ఇందులో చాలా వేదికలు గత ప్రపంచ కప్ల కోసం ఎంపిక కాలేదు. ఈ 12 వేదికల్లో తిరువనంతపురం, గువాహటి స్టేడియాల్లో వార్మప్ మ్యాచ్లు జరుగుతాయి. మిగతావన్నీ లీగ్లు, నాకౌట్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తాయి. సౌత్ జోన్ నుంచి నాలుగు, సెంట్రల్ జోన్ నుంచి ఒకటి, వెస్ట్ జోన్ నుంచి రెండు, నార్త్ జోన్ నుంచి రెండు వేదికలను ఎంపిక చేశాం. అలాగే ఢిల్లీ, ధర్మశాలలోనూ మ్యాచ్లు జరుగుతాయన్నారు. మ్యాచ్లను కేటాయించడంపై ఏ వేదికపైనా వివక్షత చూపలేదని పేర్కొన్నారు. వరల్డ్ కప్ కోసం స్టేడియాల ఎంపికలో ఐసీసీ నిర్ణయమే కీలకమన్నారు. తిరువనంతపురంలో తొలిసారి వార్మప్ మ్యాచ్ను నిర్వహిస్తున్నారు. ఈసారి చాలా స్టేడియాలు కొత్తగా ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి'' అని శుక్లా వెల్లడించారు.