‘ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు.. ఇదే వారి ఆలోచన’

by Dishanational5 |
‘ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు.. ఇదే వారి ఆలోచన’
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి గెలిస్తే ఏడాదికో ప్రధాని చొప్పున మొత్తం ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులను మార్చాలనే ఆలోచనలో వారు ఉన్నారని ప్రధాని మోడీ ఆరోపించారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో శనివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు. హస్తం పార్టీ జాతి వ్యతిరేక, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ‘‘అభివృద్ధిలో ఎన్డీయే ట్రాక్ రికార్డుతో పోటీపడలేమని గ్రహించిన కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు.. వారి వ్యూహాలను మార్చుకుని జాతి వ్యతిరేక ఎజెండా, బుజ్జగింపు రాజకీయాలను తెరపైకి తీసుకొచ్చారు. అందులో భాగంగానే కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని హామీ ఇస్తున్నారు. వారి కూటమి(‘ఇండియా’) గెలిస్తే పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) రద్దు చేస్తారు. అంతేకాకుండా, వారు గనుక కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ‘ఏక్ సాల్, ఏక్ పీఎం’(ఏడాదికో ప్రధాని) అనే ఫార్ములాను అమలు చేస్తారు. ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులను మారుస్తారు’’ అని చెప్పారు. అయితే, ప్రతిపక్ష కూటమి 100 స్థానాల్లోనూ గెలవలేదని, వారి విద్వేష రాజకీయాలను దేశమంతా తిరస్కరిస్తోందని తెలిపారు.




Next Story

Most Viewed