Digital Arrest : సైబర్ కేటుగాళ్ల కొత్త అస్త్రం 'డిజిటల్ అరెస్ట్' : సజ్జనార్ సూచనలు ఇవే..

by Ramesh N |
Digital Arrest : సైబర్ కేటుగాళ్ల కొత్త అస్త్రం డిజిటల్ అరెస్ట్ : సజ్జనార్ సూచనలు ఇవే..
X

దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాల ద్వారా ప్రజలను మోసం చేస్తుంటారు. తాజాగా డిజిటల్ అరెస్ట్‌ పేరుతో నయా పద్దతి పాటిస్తూ.. ఎప్పటి లాగానే జనాన్ని మోసం చేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్‌లు అనేది సైబర్ మోసంలో కొత్త పద్ధతి, దీనిలో మోసగాళ్ళు ఆడియో లేదా వీడియో కాల్‌లు చేస్తారు, పోలీస్, కస్టమ్స్ డిపార్ట్‌మెంట్స్ లాంటి అధికారులుగా చెప్పి మోసానికి తెరలేపుతారు. తమపై కేసులు ఉన్నాయని చెప్పి.. చర్యలు తీసుకుంటామని బెదిరింపునకు దిగుతారు. దీంతో బాధితుడు ఏమీ చేయలేక నేరగాళ్ల వలలో పడతారు. దీన్నే 'డిజిటల్ అరెస్టు' అంటారు.

ఇలాంటి మోసాలకు పాల్పడిన వ్యక్తులు ఒడిశా, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్‌లతో సంబంధం కలిగి ఉన్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గత ఎనిమిది నెలల్లో డిజిటల్ అరెస్టుల కేసుల్లో దాదాపు 13 మంది నుంచి రూ. 1.5 కోట్లు వసూలు చేశారు. హైదరాబాద్​ అడిక్​మెట్​కు చెందిన వృద్ధురాలికి గత నెలలో ముంబయి పోలీసుల పేరిట ఫోన్ చేసి బెదిరించి రూ.5.9 కోట్లు వసూలు చేశారు. ఇలా నగరంలో పలువురిని మోసం చేశారని సమాచారం. ఈ క్రమంలోనే టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా ఎక్స్ వేదికగా వెల్లడించారు.

సైబర్ కేటుగాళ్ల సరికొత్త అస్త్రం 'డిజిటల్ అరెస్ట్' అని తెలిపారు. అజ్ఞాత వ్యక్తులు కాల్ చేసి మీరు 'డిజిటల్ అరెస్ట్' అయ్యారని అంటే బెదరకండన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని సూచించారు. చట్టప్రకారం ఏ నేరంలో నైనా 'డిజిటల్ అరెస్ట్'లు ఉండవని, అలా ఎవరైనా బెదిరించారంటే మోసం చేస్తున్నట్లే అని గమనించాలని సూచించారు.

Advertisement

Next Story