అర్హత లేకున్నా.. చికిత్స..!

by Sumithra |
అర్హత లేకున్నా.. చికిత్స..!
X

దిశ, నారాయణఖేడ్ : వచ్చిరాని వైద్యంతో ఒక ఆర్.ఎం.పీ వైద్యుడు చేసిన ప్రయోగం ఆరోగ్యంతో వెళ్లిన పసిపాప ప్రాణాల మీదికి తీసుకువచ్చింది. ఈ విషాదకర సంఘటన కల్హేరు మండలం కిష్టాపూర్ గ్రామంలో జరిగింది. పూర్తివివరాల్లోకెళితే మెడికల్ షాప్ లోనే వైద్యం నిర్వహిస్తున్న మహమూద్ అలీ ఖానాపూర్ కే గ్రామానికి చెందిన మంజుల, అనిల్ దంపతుల నాలుగు నెలల పసికందు భానుప్రియ మృతికి కారణం అయ్యింది. దీంతో బంధువులు, గ్రామస్తులు డాక్టర్ పై గొడవకు దిగారు. ఆర్ఎంపీ డాక్టర్ వచ్చీరాని వైద్యం చేయడం వల్లనే పాప భానుప్రియ మృతి చెందిందంటున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితురాలి బంధువులను శాంతింప చేశారు. దీంతో పసిపాప ప్రాణానికి ఖరీదుగా రూ.1.70 లక్షలు ఇప్పిస్తామని ఒప్పించారు. అసలే వ్యాధుల కాలం.. విష జ్వరాలు విజృంభిస్తుండడంతో గ్రామాలు, పట్టణాల్లో ఆర్ఎంపీ, పీఎంపీ హవా కొనసాగుతుంది. కొందరు పరిధికి మించి వైద్యం చేస్తున్నారు. వచ్చిరాని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రథమ చికిత్స చేయాల్సిన గ్రామీణ వైద్యులు ఏకంగా ఐ డోస్ యాంటి బయోటెక్స్ వాడుతున్నారు. సూది వేయడం వస్తే చాలు డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. గర్భిణులకు అబార్షన్లు.. చిన్నచిన్న ఆపరేషన్లు.. జ్వరాలు ఇతరత్రా వ్యాధులకు చికిత్స చేస్తున్నారు. గ్రామాల్లో ఏరోగం వచ్చినా వీరి వద్దకే పరుగులు తీస్తుంటారు. అదే అదునుగా చూసుకొని వారి రోగం త్వరగా తగ్గాలని అధిక డోస్లో మందులు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే కల్హేర్ మండలం కిష్టాపూర్ లో మహమూద్ అలీ మెడికల్ షాప్ లోనే ఫాస్ట్ ఎయిడ్ క్లీనింగ్ నిర్వహిస్తున్నాడు. అతను ఫార్మాసిస్ట్.. డాక్టర్.. అనే వ్యత్యాసం లేకుండా మెడికల్ లోనే ప్రథమ చికిత్సలు కొనసాగిస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో ఇతర గ్రామాలకు, పట్టణాలకు వెళ్లలేక అందుబాటులో ఉన్న వైద్యాన్ని ఇక్కడి ప్రజలు వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఖానాపూర్ (కే)గ్రామానికి చెందిన మంజుల, అనిల్ దంపతులకు తమ నాలుగు నెలల పసికందు భానుప్రియకు అనారోగ్యంగా ఉండడంతో కిష్టాపూర్ లో గల మహమూద్ అలీ మెడికల్ షాప్ లోని క్లీనిక్ కి తీసుకొని వెళ్లారు. వైద్య సేవలు అందిస్తుండగానే పసికందు మృతి చెందింది. దీంతో విషయం తెలుసుకున్న బాధిత కుటుంబీలు, బంధువులు, గ్రామస్తులు అక్కడికి చేరుకొని డాక్టర్ పైకి ఆందోళనకు దిగారు. దీంతో సమాచారం తెలుసుకుని పోలీసులు శాంతింపజేశారు. పసికందును ప్రాణం తీసిన వైద్యుని పై చర్యలు తీసుకోవాలని బంధువులు గ్రామస్తులు కోరారు.

Advertisement

Next Story