వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వ్యక్తి మృతి..

by Aamani |
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వ్యక్తి మృతి..
X

దిశ, కంది : వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. సంగారెడ్డి రూరల్ ఎస్సై వినయ్ కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం... కంది మండలం బేగంపేట తండాకు చెందిన జాట్రోత్ పాండు (48) ఒంట్లో బాగా లేకపోవడంతో ఈ నెల 27న అతడిని దౌల్తాబాద్ లోని ఓ ప్రైవేట్ క్లినిక్ లో కుటుంబ సభ్యులు చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని ఎమ్ఎన్ఆర్ ఆసుపత్రికి తరలించారు.

కాగా ఈ నెల 28న ఉదయం 5 గంటలకు చికిత్స పొందుతున్న పాండు లేచి కొడుకుని నీరు ఇవ్వమని అడిగి తాగి పడుకున్నాడు. ఎంతకీ అతడు లేవకపోవడంతో డాక్టర్ ను సంప్రదించగా, పరీక్షించిన డాక్టర్ అప్పటికే తాను మృతి చెందినట్లు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ తండ్రి ప్రాణాలు కోల్పోయాడంటూ కుటుంబసభ్యులు బోరున విలపించారు. మృతికి కారణమైన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై చెప్పారు.



Next Story