వారికి పరిహారంతో పాటు ఉద్యోగం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

by Prasad Jukanti |   ( Updated:2024-09-11 13:50:45.0  )
వారికి పరిహారంతో పాటు ఉద్యోగం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
X

దిశ, డైనమిక్ బ్యూరో: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టుపై గత ప్రభుత్వం చిత్తశుద్ధి లోపం, సమీక్షలు జరపకపోవడం మూలంగానే అనుకున్న సమయంలో పూర్తి కాలేదని దాంతో ఆర్థిక భారం పెరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్-2 ఆయిల్ సింక్రనైజేషన్ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన భట్టి.. ఇది రాష్ట్ర ప్రజల సంపద, రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెంచడానికి విద్యుత్ అవసరాలు తీర్చడానికి ఓ ఉన్నత కార్యక్రమం అన్నారు. భూ నిర్వాసితులు గొప్ప త్యాగధనులు అని భూసేకరణ పరిహారం చెల్లించడంతో పాటు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. భూ నిర్వాసితుల విషయంలో అందరి ఆలోచనలు పరిగణలోకి తీసుకుంటామన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనుల్లో వేగం పెంచి సింక్రనైజేషన్ పనులు ప్రారంభించిన అధికారులు, సిబ్బంది, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అభినందనలు తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ పనులకు ఫిబ్రవరి 2015లోనే పునాది పడితే అదే ఏడాది అక్టోబర్ లో పనులు మొదలయ్యాయన్నారు. 2020 అక్టోబర్ లో రెండు యూనిట్లు, 2021 నాటికి మిగిలిన మూడు యూనిట్లు పూర్తి చేయాలని గత ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అనుకున్న సమయానికి అందించకపోవడం మూలంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడిందన్నారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి పవర్ ప్రాజెక్టుకు అనుమతులు నిరాకరించబడ్డాయన్నారు.

గత ప్రభుత్వం నిర్ణయం మార్పుతో పర్మిషన్లు సస్పెండ్:

గతంలో 50% విదేశీ బొగ్గు మరో 50% స్వదేశీ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ఎన్జీటీకి చెప్పారు.. కాలక్రమంలో నాటి ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవడంతో పర్యావరణవేత్తలు కోర్టుకు వెళ్లారు ఫలితంగా అనుమతులు సస్పెండ్ అయ్యాయన్నారు. అప్పుడే ఎన్జీటీకి నాటి ప్రభుత్వం సమాచారం ఇచ్చి ఉంటే ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం జరిగి ఉండేది కాదన్నారు. ఇందిరమ్మ రాజ్యం రాగానే ఎన్జీటీకి కావలసిన పబ్లిక్ హియరింగ్ ను ఈ ఏడాది ఫిబ్రవరిన చేపట్టాం. జూలైలో ఈసీ క్లియరెన్స్ తెచ్చామని ఫలితంగా రెండో యూనిట్ ఆయిల్ సింక్రనజేషన్ పనులు పూర్తయ్యాయన్నారు. మేము అధికారంలోకి వచ్చాక జరుగుతున్న పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వారానికి ఒకసారి సమీక్ష చేపట్టామన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి వారం వారం క్యాలెండర్ ఖరారు చేశామన్నారు. 31 మార్చి 2025 నాటికి 4,000 మెగావాట్ల ఉత్పత్తి సాధించే దిశగా ముందుకు వెళ్తున్నామని అందుకు అనుగుణంగా టార్గెట్లు పెట్టుకుని పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. రోడ్లు, రైల్వే, సివిల్ పనులు సైతం పూర్తిచేయాలని నిర్ణయించామని మొత్తం ఐదు యూనిట్లలో మూడు యూనిట్ల ద్వారా 2,400 మెగావాట్లను ఈ ఏడాది చివరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తయ్యాక ఖర్చు మొత్తం లెక్క కట్టి యూనిట్ ధర ఎంత అవుతుంది అనేది ఈఆర్సీ నిర్ణయిస్తుందని మా లెక్కల ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి యూనిట్ ధర 6.35 రూపాయలుగా ఉంటుందన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.

మీ శ్రమను ప్రభుత్వం గుర్తిస్తుంది:

యూనిట్ 2 సింక్రనైజేషన్ పరిశీలన సమయంలో ఉద్యోగులు, కార్మికులతో డిప్యూటీ సీఎం మాట్లాడారు. మానవ జీవితం అత్యంత విలువైనదని దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పని చేయాలని సూచించారు. కార్మికులకు దోమకాటు సైతం లేకుండా చూసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. మీ అందరి శ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడంతో పాటు గౌరవిస్తుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed