Ganja : యథేచ్ఛగా గంజాయి స్మగ్లింగ్.. పోలీసుల మాస్ వార్నింగ్

by Y.Nagarani |
Ganja : యథేచ్ఛగా గంజాయి స్మగ్లింగ్.. పోలీసుల మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రాజధాని హైదరాబాద్ లో డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల సరఫరా, వాడకంపై పోలీసులు దృష్టి సారించిన విషయం తెలిసిందే. వారాంతాల్లో పబ్బుల్లో, ఇతర పార్టీల్లో తడవుగా తనిఖీలు నిర్వహించి.. డ్రగ్స్ దొరికితే కటకటాల వెనక్కి పంపుతున్నారు. హైదరాబాద్ తో పాటు ఉమ్మడి వరంగల్ లో గంజాయి స్మగ్లింగ్ పై దృష్టిపెట్టారు పోలీసులు. గడిచిన ఏడాదిలో రూ.4.14 కోట్ల విలువైన 20 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకుని.. 103 కేసులు నమోదు చేశారు.

ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ రూ.4.12 కోట్ల విలువైన 13 క్వింటాళ్ల గంజాయిని సీజ్ చేసి.. 157 కేసులు నమోదు చేయగా.. వీటిలో అత్యధికంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్, మహబూబాబాద్ జిల్లాల్లోనే నమోదైనట్లు ఉమ్మడి వరంగల్ పోలీసులు తెలిపారు. ఆంధ్రా- ఒడిశా బార్డర్ నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో వరంగల్ కు గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం రావడంతో తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బడా స్మగ్లర్లు.. డబ్బు అవసరం ఉన్నవారిని అడ్డుగా పెట్టుకుని యథేచ్ఛగా ఎండు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారని, ఫలితంగా వాళ్లే జైలుకు వెళ్తున్నారన్నారు.

గంజాయికి అలవాటు పడి యువత తమ జీవితాన్ని నాశనం చేసుకుంటోందని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా విచారం వ్యక్తం చేశారు. గతంలో గంజాయికి అలవాటు పడి పలు నేరాలు చేసిన సందర్భాలను ఆయన గుర్తు చేశారు. ఈజీ మనీ సంపాదించాలని స్మగ్లింగ్ లో ఇరుక్కోవద్దని సూచించారు. గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నట్లు సమాచారం ఉంటే.. సమీప పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలని ఆయన కోరారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ కిషోర్ హెచ్చరించారు.

Next Story

Most Viewed