అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

by Sridhar Babu |
అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
X

దిశ, ప్రతినిధి వికారాబాద్ : అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ ప్రతీక్ జైన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీల అత్యాచారాల కేసులకు సంబంధించిన విషయాలపై సమీక్షించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సభాపతి మాట్లాడుతూ నేర ప్రవృత్తి, వివక్షకు తావులేని సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. అత్యాచార కేసులకు సంబంధించి పోలీస్ అధికారుల సహకారం తీసుకుంటూ సమన్వయంతో సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని డీవీఎంసీ సభ్యులకు సూచించారు.

దళితులు ఎలాంటి వివక్షకు గురికాకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం ప్రాముఖ్యతను కళాబృందాల ద్వారా అవగాహన కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావియ్యకుండా నిష్పక్షపాతంగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. బాధిత కుటుంబాలకు చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని తొందరలోనే అందిస్తామన్నారు. జిల్లాలో కేసులను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా డీవీఎంసీ సమావేశాలు నిర్వహించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై ప్రభుత్వ కార్యాలయాల్లో, గ్రామాల్లో సూచిక బోర్డులను ప్రదర్శించాలని, ప్రతి నెలా పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించి సమస్యల పరిష్కారానికి పోలీస్, రెవెన్యూ అధికారులు కృషి చేయాలన్నారు. ఎస్సీ , ఎస్టీల భూ సమస్యలపై దృష్టి సారించి పరిష్కార దిశగా పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, డీఎస్సీడీఓ మల్లేశం, డీబీసీడీఓ ఉపేందర్, డీటీడీఓ కమలాకర్ రెడ్డి, డీఎఫ్ఓ వెంకన్న, డీఎస్ఓ మోహన్ బాబు, కమిటీ సభ్యులు అనంతయ్య, జగదీష్, దస్తప్ప, కిరణ్ రోనాల్డ్, సురేందర్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed