కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోవద్దు : ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by Disha Web Desk 11 |
కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోవద్దు : ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
X

దిశ, ప్రతినిధి వికారాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. శనివారం వికారాబాద్ నియోజకవర్గంలోని ధారూర్ మండలంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడుతూ..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 6 గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను చెంపదెబ్బలు కొట్టిందన్నారు. పెన్షన్లను పెంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి పాత పెన్షన్లను కూడా సరిగ్గా ఇవ్వడం లేదన్నారు. నిరుద్యోగ భృతి, కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేశారన్నారు.

రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని ఒక్క పైసా కూడా మాఫీ చేయలేదని ఆరోపించారు. గతంలోని కేసీఆర్ సర్కారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్, ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి పథకాలు రాష్ట్రంలో అమలు కాకుండా పోయాయన్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపించడం ద్వారా చేవెళ్ల ప్రాంతానికి పెద్ద మొత్తంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ఇక దేశం మొత్తంలో కూడా భారతీయ జనతా పార్టీ హవా కొనసాగుతోందని, మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని కాబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశ మొత్తం ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అంటూ నినదీస్తోందని, మన రాష్ట్రంలోని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా ఈసారి బీజేపీ కి ఓటేద్దామని నిర్ణయించుకున్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ ప్రజా ఆశీర్వాద సభలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మాధవ రెడ్డి, నాయకులు కెపి రాజు, వడ్ల నందు, నవీన్, నియోజకవర్గ బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



Next Story

Most Viewed