డిసెంబర్ ​నాటికి పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఫస్ట్​ఫేస్​.. మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి

by Ramesh Goud |
డిసెంబర్ ​నాటికి పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఫస్ట్​ఫేస్​.. మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం సచివాలయంలో నీటిపారుదల శాఖ సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మొదటి దశ పనులు ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపట్టనున్నారు. డిసెంబర్ 2025 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే, వివిధ రిజర్వాయర్ల పనులు వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

కరివెన రిజర్వాయర్‌ వరకు పనులు వేగవంతం చేయడంతోపాటు నార్లాపూర్‌, ఏదుల రిజర్వాయర్‌ల మధ్య ప్యాకేజీ–III కాలువ పనులు వెంటనే ప్రారంభించి 2025 అక్టోబర్‌ నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసేలా నిర్ణయం తీసుకున్నారు. రిజర్వాయర్ సామర్థ్యాలు ఇంపౌండింగ్ లక్ష్యాలలో నార్లాపూర్(6.40 టీఎంసీ), ఏదుల (6.55 టీఎంసీ), వట్టెం (16.70 టీఎంసీ), కరివెన(19.00 టీఎంసీ) వద్ద అన్ని రిజర్వాయర్ పనులు సకాలంలో పూర్తి చేయనున్నారు. తద్వారా డిసెంబర్ 2025 నాటికి సుమారు 50 టీఎంసీ నీటిని నిలుపుదల చేయాలని నిర్ణయించారు. ఎలక్ట్రికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కింద నార్లాపూర్, ఏదుల, వట్టెం పంపింగ్ స్టేషన్లలో 400 కెవి సబ్‌స్టేషన్‌లను పూర్తి చేసేందుకు టిజిట్రాన్స్‌కోకు ఏఎన్​ఆర్​262 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు.

జూలై 2025 నాటికి పంపుల డ్రై రన్ నిర్వహించబడుతుందన్నారు. రిజర్వాయర్ కెపాసిటీ పునరుద్ధరించనున్నారు. తద్వారా 12 టీఎంసీల అసలు నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించేందుకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డీ-సెడిమెంటేషన్ పనులను చేపట్టాలని నిర్ణయించారు. సమీక్షలో తీసుకున్న నిర్ణయాలతో ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా సాగునీటి మౌలిక సదుపాయాలను బలోపేతానికి, వ్యవసాయం తాగునీటి అవసరాల కోసం స్థిరమైన నీటి వనరులను నిర్ధారించడంలో ప్రభుత్వ నిబద్ధతలో గణనీయమైన పురోగతిని సాధిస్తోందన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story