ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో మహిళలకు ప్రాధాన్యం.. కలెక్టర్

by Sumithra |
ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో మహిళలకు ప్రాధాన్యం.. కలెక్టర్
X

దిశ, కామారెడ్డి : ప్రభుత్వ నిర్ణయం మేరకు మహిళా సంఘాలకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కువగా కేటాయించారని, ఎలాంటి సమస్యలు రాకుండా ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. 2024 - 25 యాసంగి సీజన్ లో వరి ధాన్యం కోనుగోళ్ల పై గ్రామ అధ్యక్షులు, సబ్ కమిటీ, సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆకాంక్ష మేరకు మహిళా సంఘాల ద్వారా వరి ధాన్యం కొనుగోళ్లకు ఈ యాసంగి సీజన్ లో 183 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నదని, గతంలో జిల్లాలో 27 కేంద్రాల్లో కొనుగోలు చేసిన మహిళా సంఘాలకు ఈ సారి మరో 156 కేంద్రాలు సంఘాలకు అదనంగా 41 శాతం కేటాయించారని తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. జిల్లాలో వరి ధాన్యం కోతలు ప్రారంభం అయ్యాయని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అవసరమైన పరికరాలు క్యాలీపర్స్, టార్పాలిన్, తూకం యంత్రాలు, తేమ కొలిచే యంత్రం, తదితర పరికరాలతో పాటు కేంద్రంలో త్రాగునీరు, వేసవి దృష్ట్యా నీడ ఏర్పాటు, ఓ.ఆర్.ఎస్. పాకెట్స్, తదితర ఏర్పాట్లు చేయాలని తెలిపారు. సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించడం జరుగుతుందని తెలిపారు.

రబీ సీజన్ లో వడగళ్ల వానలు పడే ఆస్కారం ఉంటుందని, టార్పాలిన్లను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. 17 శాతం తేమ ఉన్న వడ్లను కొనుగోలు చేసుకోవచ్చని, దొడ్డు, సన్నం వడ్లను విడివిడిగా పెట్టాలని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యంను ట్యాబ్ ఎంట్రీ చేసి మిల్లులకు తరలించాలని, రైతులకు రెండు రోజుల్లో చెల్లింపులు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.విక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మహిళలకు ఎక్కువ కొనుగోలు కేంద్రాలు కేటాయించారని, పురుషులతో సమానంగా కొనుగోళ్లు చేయాలని తెలిపారు. అంతకుముందు వడ్లు కొనుగోళ్లు, కొలతలు వంటి అంశాల పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా సహకార అధికారి రామ్ మోహన్, జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మురళీ కృష్ణ, మహిళా సంఘాల అధ్యక్షులు, ఏపీఎంలు, సీసీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed