సరైన ఆధారాలు లేకుండా ఎక్కువ నగదుతో ప్రయాణించొద్ధు

by Disha Web Desk 15 |
సరైన ఆధారాలు లేకుండా ఎక్కువ నగదుతో ప్రయాణించొద్ధు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పార్లమెంట్ ఎన్నికలు 2024 నియమావళి అమలులోకి వచ్చిన సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పోలీస్, ఎస్ఎస్ టీ, ఎఫ్​ఎస్ టీమ్స్ తనిఖీలు నిర్వహిస్తున్నాయని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ తనిఖీలలో రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు కానీ, బంగారం, వెండి కానీ ఉండి సరైన ఆధారాలు చూపకుంటే తనిఖీ అధికారులు ఆ డబ్బులను, వస్తువులను జప్తు చేస్తారని తెలిపారు. తనిఖీల్లో జప్తు చేసిన నగదు , బంగారం, వెండి వస్తువులు రూ.10 లక్షలకు లోబడి ఉండి, తగిన ఆధారాలు చూపిన పక్షంలో వాటిని విడుదల చేయడానికి జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ గ్రీవెన్స్ కమిటీ (డీ.జీ.సీ)ని ఏర్పాటు చేశామని తెలిపారు.

ఈ కమిటీకి అదనపు కలెక్టర్​ (రెవెన్యూ) చైర్మన్ గా వ్యవహరిస్తారని, సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్, జిల్లా కోశాధికారి జిల్లా గ్రీవెన్స్ కమిటీ పని చేస్తుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వివరించారు. రూ. పది లక్షల లోపు నగదు లేదా బంగారం, వెండి వస్తువులకు సంబంధించిన ఆధారాలను జిల్లా గ్రీవెన్స్ కమిటీ పరిశీలించి, అన్నీ సక్రమంగా ఉన్న వాటిని విడుదల చేస్తుందన్నారు. ఒకవేళ జప్తు చేయబడిన నగదు,బంగారం, వెండి ఇతర వస్తువుల విలువ రూ. పది లక్షలకు మించి ఉంటే ఈ కమిటీ ఆ వివరాలను పరిశీలన కోసం ఆదాయపు పన్ను విభాగం నోడల్ అధికారికి పంపుతుందని తెలిపారు. జిల్లాలో నేటి వరకు మూడు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.

ఇందులో ఒక కేసు రూ.50 వేలను తగిన ఆధారాలు చూపించినందున డీజీసీ కమిటీ ఆ మొత్తాన్ని విడుదల చేసిందన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఎవరు కూడా రూ. 50 వేల నగదు కంటే ఎక్కువ డబ్బులు కానీ బంగారం, వెండి వస్తువులతో ప్రయాణించకూడదని సూచించారు. ఒకవేళ తెలియక ప్రయాణించి తనిఖీలలో బంగారం, వెండి వస్తువులు జప్తు చేస్తే ఆందోళన చెందకుండా సంబంధిత ధ్రువపత్రాలతో జిల్లా గ్రీవెన్స్ కమిటీని (కలెక్టర్ కార్యాలయం) నందు నోడల్ అధికారి పల్లె పాపయ్య, డిప్యూటీ రిజిస్ట్రార్, కోఆపరేటివ్, నిజామాబాద్ (సెల్ నెం. 7997590472) ను సంప్రదించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు.


Next Story

Most Viewed