బీజేపీని ఒక్కసారి గెలిపించండి.. బాల్కొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా: ఏలేటి అన్నపూర్ణమ్మ

by Mahesh |   ( Updated:2023-11-28 12:24:46.0  )
బీజేపీని ఒక్కసారి గెలిపించండి.. బాల్కొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా: ఏలేటి అన్నపూర్ణమ్మ
X

దిశ, ఆర్మూర్: బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించండి.. బాల్కొండను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని బాల్కొండ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ అన్నారు. మంగళవారం బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్ పల్లి మండలం బషీరాబాద్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే, బాల్కొండ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ.. మంత్రి ప్రశాంత్ రెడ్డి పెద్ద అవినీతిపరుడని విమర్శించారు.

మంత్రి ప్రశాంత్ రెడ్డి, అతని సోదరుడు నియోజకవర్గంలోని యువతను గంజాయికి బానిసలుగా చేస్తున్నారని మండిపడ్డారు. బాల్కొండలో బీజేపీని గెలిపిస్తే ఆడబిడ్డ పుట్టగానే వారి పేరు మీద 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామన్నారు. వరి వేసే రైతులకు భారీ ఊరటగా క్వింటాల్ వరికి 3100 రూపాయలు మద్దతు ధర ఇస్తామన్నారు. డిగ్రీ చదువుకునే విద్యార్థినిలకు ఉచితంగా లాప్ టాప్ లు ఇస్తామన్నారు.ప్రజలందరికి ఉచిత విద్య - ఉచిత వైద్యం అందించడమే బిజెపి ధ్యేయమన్నారు. ఉజ్వల యోజన లబ్ధిదారులకు సంవత్సరానికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు.

రాష్ట్రంలో డబల్ ఇంజిన్ సర్కార్ వస్తే ప్రతి వ్యక్తికి న్యాయం జరుగుతుందన్నారు. ఆరు గ్యారంటీలు కాదు ముందుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిస్తే పార్టీ మారమని గ్యారంటీ ఇవ్వాలని విమర్శించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రతీ పనిలో 30% కమిషన్ తీసుకున్నాడని విమర్శించారు. బాల్కొండలో బీజేపీని గెలిపిస్తే అర్హులందరికీ ఇండ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. బాల్కొండ ఎమ్మెల్యేగా ఆడబిడ్డ నైనా నన్ను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించాలని బాల్కొండ నియోజకవర్గం ప్రజలను బిజెపి బాల్కొండ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, మండల అధ్యక్షులు కట్ట సంజీవ్, గోవర్ధన్, మురళి, పోతునూరి గణేష్, సక్కారం నర్సారెడ్డి, రాజ్ కుమార్, వంశీ, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed