బీజేపీ క్యాండిడేట్ క్యాంప్ కార్యాలయంపై బీఆర్ఎస్ నాయకుల దాడి..

by Vinod kumar |
బీజేపీ క్యాండిడేట్ క్యాంప్ కార్యాలయంపై బీఆర్ఎస్ నాయకుల దాడి..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: బాన్సువాడ బీజేపీ క్యాండిడేట్ క్యాంప్ కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. బాన్సువాడ పట్టణంలోని బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ రాత్రి తన క్యాంపు కార్యాలయంలో నిద్రిస్తుండగా నలుగురు వ్యక్తులు అక్కడికి చేరుకొని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న డ్రైవర్లను లేపి దుర్భాషలాడారు. వారిపై దాడి చేసి కొట్టారు. పైన పోర్షన్‌లో ఉన్న యెండల లక్ష్మీనారాయణకు విషయం తెలియడంతో ఆయన స్పెషల్ బ్రాంచ్ అధికారులకు సమాచారం అందించారు. డ్రైవర్లు, గన్మెన్ డయల్ 100 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. స్థానికంగా విధుల్లో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆరా తీశారు. అప్పటికే అక్కడ ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు వెళ్లిపోయారు. అక్కడికి చేరుకున్న బాన్సువాడ సీఐ ఎవరిపైన దాడి జరిగింది ఎవరెవరికి దెబ్బలు తలిగాయని ఆరా తీయగా.. అక్కడికి చేరుకున్న బీజేపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ తో సీఐ వాగివివాదానికి దిగారు. డ్రైవర్లు తమపై జరిగిన దాడికి సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

బీజేపీ అభ్యర్థి క్యాంప్ కార్యాలయం పై దాడి జరిగినప్పుడు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అక్కడే ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని సర్వేలు ఇంటలిజెన్స్ నివేదిక ఆధారంగానే తనపై పథకం ప్రకారం హత్యాయత్నానికి పోచారం కుటుంబం ప్రయత్నించిందని యెండల లక్ష్మీనారాయణ ఆరోపించారు. పోలీసులు స్థానికంగా ఉన్న తమకు రక్షణ లేకుండా పోయిందని అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ క్యాండిడేట్ లక్ష్మీనారాయణ క్యాంప్ కార్యాలయంలోకి చొరబడిన వీడియో సీఐతో జరిగిన వాగివాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed