అంబేద్కర్ విగ్రహం ఎదుట బీజేపీ అభ్యర్థి నిరసన

by Sumithra |   ( Updated:2023-11-29 11:56:47.0  )
అంబేద్కర్ విగ్రహం ఎదుట బీజేపీ అభ్యర్థి నిరసన
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : భారతీయ జనతా పార్టీ బాన్సువాడ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ బుధవారం బాన్సువాడ పట్టణంలో నిరసన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయం మరికొన్ని గంటలు ఉండగా తన ఇంటి పై పోచారం కుటుంబ సభ్యులు దాడి చేయడాన్ని నిరసిస్తూ బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించారు. నోటికి నల్లగుడ్డ కట్టుకుని విగ్రహం ముందు కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బాన్సువాడలో బీజేపీ అభ్యర్థిగా తాను పోటీ చేయడం వలన పోచారం కుటుంబం పునాదులు కదులుతున్నాయని అన్నారు. ఎప్పటి నుంచో నిర్మించుకున్న తమ సామ్రాజ్యం కూలిపోతుందని పోచారం కుటుంబం తనపై దాడికి పూనుకుందని అన్నారు.

మంగళవారం అర్ధరాత్రి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా తాను నివసిస్తున్న ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించిన డీసీసీబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, అతని అనుచరులు గ్రౌండ్ ఫ్లోర్లో తన డ్రైవర్లైన దత్తు, కిషోర్ లపై దాడి చేసి కొట్టడమే కాకుండా బీజేపీ అభ్యర్థిగా బాన్సువాడలో పోటీ చేస్తున్న బాయ్ సాబ్ చంపుతామని బెదిరించారని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడ దలచిన పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన డ్రైవర్ల పై దాడి చేసి, తనను చంపుతానని బెదిరించిన బీఆర్ఎస్ నాయకుల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తనకు మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు సానుభూతిపరులకు మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు సంయమనం పాటించాలని కోరారు. మరికొన్ని గంటల్లో జరిగే ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరగాలని నియంతృత్వ పోకడలకు వెళ్లిన వారికి ఓటుతో సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ లో దాడి గురించి ఫిర్యాదు చేసినట్లు యెండల లక్ష్మీనారాయణ తెలిపారు.

Next Story

Most Viewed