బడా బజార్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్ పై పోలీస్ కేసు నమోదు..

by Sumithra |
బడా బజార్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్ పై పోలీస్ కేసు నమోదు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ బడాబజార్ బ్రాంచి మేనేజర్ అజయ్ పై పోలీస్ కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ నరహరి తెలిపారు. బ్యాంకు కస్టమర్లకు చెందిన డబ్బును మోసపూరితంగా తన వ్యక్తిగత ఖాతాల్లోకి మార్చుకున్నాడని వచ్చిన ఫిర్యాదులతో మేనేజర్ అజయ్ పై కేసు నమోదు చేశారు. పుల్లూరి రాకేష్ అనే వ్యక్తి తన లోన్ కి సంబంధించి షూరిటీగా పెట్టిన రూ. 20 లక్షల విలువ చేసే చెక్కులను వారికి తెలియకుండా బ్యాంకు మేనేజర్ అజయ్ నగదుగా మార్చుకొని వాడుకున్నాడని బాధితుడు చేసిన లిఖిత పూర్వక ఫిర్యాదు పై స్పందించి కేసు నమోదు చేసినట్టు టౌన్ సీఐ నరహరి తెలిపారు. సదరు నిందితుడు బ్యాంక్ మేనేజర్ అజయ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలిపారు. నిందితుడు అజయ్ ఇదే పద్ధతిలో ఇంకా చాలా మందిని మోసం చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అలాగే బ్యాంకులోని ఇతర సిబ్బందికి తెలియకుండా మేనేజర్ ఏకపక్షంగా ఖాతాదారుల డబ్బులు బ్యాంకు మేనేజర్ ఖాతాలోకి మార్చుకోవడం పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు లోతుగా విచారణ జరిపితే మేనేజర్ తో పాటు సిబ్బంది పాత్ర కూడా ఉందన్న విషయం బయట పడే అవకాశాలున్నాయి. ఖాతాదారులకు నమ్మకంగా ఉండాల్సిన బ్యాంకులోనే మోసాలు జరిగితే ఖాతాదారుల డబ్బులకు రక్షణ ఎక్కడుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపడితే చాలా విషయాలు బయటపడే ఆస్కారం ఉంటుందని ఖాతాదారులు అంటున్నారు. పోలీసు విచారణ జరుగుతోందని ఖాతాదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.

Next Story

Most Viewed