ఎమ్మార్వో ఆఫీసులో ఖాళీ బిందెలతో నిరసన.. నీళ్ల కోసం మహిళల పోరాటం

by Nagam Mallesh |
ఎమ్మార్వో ఆఫీసులో ఖాళీ బిందెలతో నిరసన.. నీళ్ల కోసం మహిళల పోరాటం
X

దిశ,తుంగతుర్తి : మంచినీళ్లు రావట్లేదని.. రోడ్ల మీద, ఊర్లలో మహిళలు నిరసనలు చేస్తున్న ఘటనలు చూస్తుంటాం. కానీ ఇప్పుడు కొందరు మహిళలు మాత్రం ఏకంగా ఎమ్మార్వో ఆఫీసులో బిందెలతో నిరసన తెలిపారు. తుంగతుర్తి మండల తహసిల్దార్ ఆఫీసులో తుంగతుర్తి గ్రామం4వ వార్డు ప్రజలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. అదే ఖాళీ బిందెలతో కార్యాలయంలోకి వచ్చి తహసిల్దార్ కంట్లమయ్య ముందు తమ గోడును వెల్లబోసుకున్నారు. సంబంధిత గ్రామ కార్యదర్శితో పాటు అధికారులకు ఎన్నో మార్లు తమ గోడును చెప్పుకున్నప్పటికీ ఫలితం లేదంటూ మహిళలు వివరించారు. ముఖ్యంగా దూరంలో ఉన్న వ్యవసాయ బావుల పైనే తామంతా ఆధారపడుతున్నామని తెలిపారు. నీళ్ల సమస్యతో నరకయాతన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించకపోతే తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడతామని పేర్కొన్నారు. అనంతరం తాసిల్దార్ కంట్లమయ్యకు ఒక వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కోట రామస్వామి, వార్డు ప్రజలు త్రివేణి, కొండ నాగమ్మ, సోమలక్ష్మి, కొండ వెంకన్న, రామగిరి వెంకన్న, రజిత, నాగమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed