ఆర్టీసీ బస్సు ఎక్కిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-06 09:14:34.0  )
ఆర్టీసీ బస్సు ఎక్కిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణికుల సమస్యలు తెలుసుకున్నారు. చౌటుప్పల్ నుంచి మునుగోడు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మునుగోడు బస్టాండ్ కు చేరుకోగా అటుగా వచ్చిన రాజగోపాల్ రెడ్డి బస్సు ఎక్కి మహిళలను పలకరించారు. ప్రతిరోజు ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని డ్రైవర్ ని అడిగి తెలుసుకున్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఎలా ఉందంటూ బస్సులోని మహిళలను అడిగారు. ఉచిత ప్రయాణం చేసేవాళ్లము దర్జాగా కూర్చుంటున్నామని.. టికెట్ తీసుకున్న వాళ్లకు బస్సులో సీటు దొరకడం లేదని ఒక మహిళ చెప్పిన మాటతో రాజగోపాల్ రెడ్డి సహా బస్సులోని వారంతా ఒక్కసారిగా గొల్లుమని నవ్వారు.

అంతకుముందు రాజగోపాల్ రెడ్డి తన పిలుపుకు స్పందించి గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్మూలించినందుకు కమిటీ సభ్యులను క్యాంపు కార్యాలయంలో సన్మానించి అభినందనలు తెలిపారు. మండల కేంద్రంగా, నియోజక కేంద్రంగా ఉన్న మునుగోడును త్వరలో మున్సిపాలిటీ కేంద్రంగా ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఓకే ప్రాంగణంలో ఉండే విధంగా మార్పులు చేయాలని, వెజ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా ఒకే ప్రదేశంలో ఉండాలన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలు జరగాలన్నారు..డిగ్రీ ఇంటర్ పాలిటెక్నిక్ లాంటి కళాశాలలు ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసుకోవాలని తన ఆలోచనలను మండల నాయకులకు వివరించారు.

Advertisement

Next Story