మార్కెట్‌ పాలకవర్గ ఏర్పాట్లపై మంత్రి దామోదర్‌ అసహనం

by Kalyani |
మార్కెట్‌ పాలకవర్గ  ఏర్పాట్లపై మంత్రి దామోదర్‌ అసహనం
X

దిశ, అందోల్‌: జోగిపేట మార్కెట్‌ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారం ఆదివారం స్థానిక శ్రీరామ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, జహీరాబాద్‌ ఎంపీ సురేష్‌ షేట్కార్‌లు ముఖ్య అతిథులుగా హజరయ్యారు. ఈ కార్యక్రమంలో నూతన పాలకవర్గం ప్రమాణం స్వీకారం చేశారు. పుల్కల్, చౌటకూరు, అందోలు, టేక్మాల్‌ మండలాలకు చెందిన కార్యకర్తలు, రైతులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినా అనుకున్న స్థాయిలో హాజరుకాకపోవడంపై గుసగుసలు వినిపించాయి. ఎంపీ సురేష్‌ షెట్కార్‌ ప్రసంగిస్తున్న సమయంలో భోజనాలను ప్రారంభించడంతో ఎంపీ ప్రసంగానికి పలుసార్లు అడ్డంకులు ఏర్పడ్డాయి. పలుసార్లు నాయకులు భోజనశాలలో అల్లరి కాకుండా చూడాలని చెప్పిన ప్రయత్నాలు ఫలించలేదు. మంత్రి ప్రసంగించే సమయంలో కూడా ఇదే పరిస్థితి ఉండడంతో మంత్రి ఎక్కువ సేపు మాట్లాడలేకపోయారు. తన ప్రసంగంలో మాట్లాడే విషయాలపై తన పీఏల ద్వారా చాలా సేపు వివరాలను సేకరించి రాసుకున్నా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం తో ఎక్కువ సేపు మాట్లాడలేకపోయారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేసిన స్థానిక కాంగ్రెస్‌ నాయకులపై మంత్రి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఆసుపత్రి, కేజీబీవీ పాఠశాల పరిశీలన

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర్‌ రాజనరసింహా అందోలులోని కేజీబీవీ, నర్సింగ్‌ కళాశాల భవనాల పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అనంతరం జోగిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి రోగులతో మాట్లాడారు.ఆసుపత్రిలో చికిత్సలు ఎలా చేస్తున్నారు? సేవలు సక్రమంగా అందుతున్నాయా? లేదా? అడిగి తెలుసుకున్నారు. గాంధీ పార్కును పరిశీలించి ఆ స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణంపై అధికారులతో మాట్లాడారు.

నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం

జోగిపేట మార్కెట్‌ చైర్మన్‌గా ఎం.జగన్మోహన్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా ఎల్లంపల్లి సత్యనారాయణ «(ధనూర), డైరెక్టర్‌లుగా పిర్లమర్ల నాగరాజ్‌ (జోగిపేట), చింతకుంట భిక్షపతి(జోగిపేట), డప్పు శేఖర్‌ (చౌటకూర్‌), రాట్ల ధనిబాయి (టేక్మాల్‌), మహ్మద్‌ ఫారుఖ్‌ ఆలీ (జోగిపేట), పెద్దగొల్ల అశోక్‌ (అల్మాయిపేట్‌), పట్లోళ్ల మధుసూధన్‌రెడ్డి (రోళ్లపాడ్‌), దానంపల్లి బాలయ్య (చౌటకూర్‌), రాజేష్‌ గౌడ్‌ (ఎల్లంపల్లి), సంగమేశ్వర్‌ (బర్ధిపూర్‌), కమాల్‌రెడ్డి (ముద్దాయిపేట్‌), ఎర్ర ప్రతాప్‌ సింహం (ముద్దాయిపేట్‌)లు ప్రమాణం చేశారు. వీరిని మంత్రితో పాటు ఇతర నాయకులు శాలువాతో సత్కరించారు.

Advertisement

Next Story

Most Viewed