- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఐటీ ఉద్యోగులు ఉండే ప్రాంతమే టార్గెట్గా చేసుకుని చోరీలు...

దిశ, కూకట్పల్లి : ఐటీ ఉద్యోగులు నివాసం ఉంటున్న హాస్టళ్లు, అపార్ట్మెంట్లను టార్గెట్గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న దొంగను కేపీహెచ్బీ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ రావు, సీఐ రాజశేఖర్ రెడ్డి, డీఐ రవి కుమార్లతో కలిసి వివరాలు వెళ్లడించారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేపీహెచ్బీకాలనీ ఎల్ఐజీ ఫేజ్ 1, 7వ ఫేజ్లలోని రెండు హాస్టళ్లలో 2 డెల్, 1 లెనోవ, 1 హెచ్పీ లాప్టాప్లు, సాంసంగ్ మొబైల్ ఫోన్ చోరీ జరిగినట్టు ఈ నెల 23వ తేదీన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో నిందితుడు జీవ గణేష్ అలియాస్ గణేష్ (26)గా గుర్తించారు. బాలానగర్ సీసీఎస్ పోలీసులు, కేపీహెచ్బీ పోలీసులు గణేష్ గురించి గాలించడం ప్రారంభించారు. తమిళనాడు రాష్ట్రం, వెల్లూరు గ్రామానికి చెందిన గణేష్ సొంతూరు నుంచి వలస వచ్చి సంగారెడ్డి జిల్లా, పటాన్ చెరువు ఇస్నాపూర్లో నివాసం ఉంటు మేస్త్రీగా పని చేసుకుంటున్నాడు.
గణేష్ నివాసం ఉంటున్న అదే ప్రాంతంలో ఉంటున్న కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ఇద్దరు స్నేహితులయ్యారు. ఈ క్రమంలో కుమార్ గణేష్తో మేస్త్రిగా పని చేస్తే ఏం లాభం తనతో పాటు ముంబాయికి వస్తే తక్కువ సమయంలో ఎక్కవ డబ్బులు ఎలా సంపాదించాలో నేర్పిస్తానని చెప్పి తనతో పాటు ముంబాయికి తీసుకు వెళ్లాడు. ముంబాయిలో కుమార్ గణేష్కు చోరీలు ఎలా చేయాలో నేర్పించాడు. ఈ క్రమంలో ఇద్దరు ముంబాయిలో లాప్టాప్లు చోరీ చేసి కుమార్కు తెలిసిన తోటనం గ్రామానికి చెందిన రాజేందర్ అనే వ్యక్తికి విక్రయించే వారు. గత మూడు నెలల క్రితం కుమార్ అనారోగ్యంతో మృతి చెందిన తర్వాత గణేష్ చోరీలు చేసేందుకు హైదరాబాద్ నగరం అనువైందిగా గుర్తించాడు. కూకట్పల్లి, కేపీహెచ్బీ, మియాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఐటీ ఉద్యోగులు ఎక్కువగా నివాసం ఉంటున్న ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడటం ప్రారంభించాడు. ఈ క్రమంలో 2024లో చివరిలో మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు చోట్ల చోరీలకు పాల్పడ్డాడు. అనంతరం కూకట్పల్లిలో ఒకటి, కేపీహెచ్బీలో రెండు చోరీలకు పాల్పడినట్టు ఏసీపీ శ్రీనివాస్ రావు తెలిపారు.
వరుసగా చోరీలకు పాల్పడుతున్న గణేష్ గురించి దర్యాప్తు ప్రారంభించిన కేపీహెచ్భీ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి గణేష్ను అరెస్ట్ చేశారు. విచారణలో గణేష్ తాను చేసిన చోరీలను అంగీకరించాడు. చోరీ చేసిన వాటిని రాజేందర్కు విక్రయించినట్టు గణేష్ పోలీసుల విచారణలో తెలిపాడు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 డెల్ లాప్టాప్లు, 1 హెచ్పి లాప్టాప్, 1 సాంసంగ్ మొబైల్, కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 1 ఆపిల్ లాప్టాప్, 1 లెనోవో లాప్ టాప్, మియాపూర్లో 1 లెనొవా, మరో 3 లాప్టాప్లు, 1 మొబైల్ చోరీ చేసినట్టు నేరం అంగీకరించారు. నిందితుడి నుంచి 2 డెల్ లాప్టాప్లు, 2 లెనోవా లాప్టాప్, 1 హెచ్పి లాప్టాప్, 1 ఆపిల్ లాప్టాప్, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు ఏసీపీ శ్రీనివాస్ రావు తెలిపారు. కేసును చాక చక్యంగా చేధించినందుకు సిఐ ఎస్. రాజశేఖర్ రెడ్డి, డిఐ కే. రవి కుమార్, డిఎస్సై అబ్దుల్ సమద్, క్రైం సిబ్బంది నరేందర్ గౌడ్, రాజు నాయక్, రాంచందర్, సురేష్, రఘురామ్, జాహెదలను ఏసీపీ శ్రీనివాస్ రావు అభినందించారు.
చోరీలు జరగకుండా జాగ్రత్తలు పాటించండి: ఏసీపీ శ్రీనివాస్ రావు..
వేసవి కాలం కావడంతో ప్రజలు తమ ఇంటి తలుపులు తెచిరి పడుకోవడం, హాస్టళ్లలో బ్యాచిలర్స్ తమ గదుల తలుపులు తెచిరి పడుకోవడం చేస్తుండటంతో దొంగలు చోరీలకు పాల్పడేందుకు సులువు అవుతుంది. తమ విలువైన వస్తువులను బధ్ర పరచుకోవడానికి అన్ని జాగ్రత్తలు పాటించాలని, తలుపులు తెరిచి పెట్టి నిద్రించడం సరికాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.