Minister Damodar Rajanarsimha : నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లకు కేబినెట్‌ ఆమోదం

by Kalyani |   ( Updated:2024-10-27 13:21:35.0  )
Minister Damodar Rajanarsimha : నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లకు కేబినెట్‌ ఆమోదం
X

దిశ, అందోల్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే పార్టీలకు అతీతంగా అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తుందని, దీపావళి పండుగ కానుకగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లను ఇంచేందుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఆయన అన్నారు. ఆదివారం జోగిపేటలోని శ్రీరామ ఫంక్షన్‌ హాల్‌లో జోగిపేట మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ సురేష్‌ షేట్కార్(MP Suresh Shetkar), మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha), మార్కెటింగ్‌ అధికారుల సమక్షంలో పాలకవర్గం సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇళ్లు, జాగాలు లేని నిరుపేదలకు పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ ఇందిరమ్మ పథకం ద్వారా ఇండ్లను అందజేస్తామని ఆయన తెలిపారు. జాతీయ రహదారులపై ప్రమాదవశాత్తు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడిన వారిని కాపాడుకునేందుకు ప్రతి 30 కిలోమీటర్ల దూరంలో ఎమర్జెన్సీ కింద ట్రామా సెంటర్‌లను ఏర్పాటు చేయబోతున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 76 ట్రామా సెంటర్‌లను ఏర్పాటు చేస్తామన్నారు.

ఈ ట్రామా సెంటర్‌ల ద్వారా గాయపడిన వారిని ప్రాణాపాయం నుంచి కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. అందోల్‌ నియోజకవర్గ వ్యాప్తంగా 38750, మంది రైతులకు రుణమాఫీ జరిగిందని, మరో 2 వేల మందికి రూ.425 కోట్లు రుణమాఫీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. సింగూరు కాలువకు రూ.168 కోట్లతో సిమెంట్‌ క్రాంకిట్‌ లైనింగ్‌ను ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. సింగూరును పర్యాటక రంగంగా తీర్చిదిద్దుతామని, దీని ద్వారా వందల కుటుంబాలు వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతాయన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా కులగణన ను ప్రభుత్వం చేయబోతుందని, దీని ద్వారా అన్ని కులాలకు సముచిత న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జాబ్‌ క్యాలెండర్‌ ను ప్రకటించి, ఆ మాటకు కట్టుబడి నోటిఫికేషన్‌లు వేసి ఉద్యోగాలను కల్పిస్తున్నామన్నారు. ఏ నాయకుడికైనా ప్రాంతీయ అభిమానం ఉండాలని, నా ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు నా ప్రయత్నం ఉంటుందన్నారు. జోగిపేటను వ్యాపారపరంగా పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు రూ.80 కోట్లతో అజ్జమర్రి నుంచి జోగిపేట్ వరకు రోడ్డు ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయన్నారు.

జేఎన్‌టీయూ, పాలిటేక్నిక్, పీజీ కళాశాలలు ఉన్నాయని, ప్రస్తుతం అందోలులో 60 సీట్లతో నర్సింగ్‌ కళాశాల మంజూరైందని, నవంబర్, డిసెంబర్‌లలో అడ్మిషన్‌లు జరుగుతున్నాయన్నారు. జోగిపేటలో 150 పడకల ప్రభుత్వాసుపత్రి, వట్‌పల్లికి 30 పడకల ప్రభుత్వాసుపత్రి మంజూరైందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆయన అన్నారు. జోగిపేట వ్యవసాయ మార్కెట్‌ను అన్ని విధాలుగా అభివృద్ది దిశగా పాలకవర్గం ముందుకు సాగాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్‌ షేట్కార్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ అంజయ్య, వీరశైవలింగాయత్‌ రాష్ట్ర అధ్యక్షుడు సంగమేశ్వర్, ఆర్డివో పాండు, మార్కెట్ సెక్రటరీ సునీల్, కమిషనర్ మల్లయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, వైస్‌ చైర్మన్‌ డేవిడ్, కౌన్సిలర్‌లు ఎస్‌.సురేందర్‌గౌడ్, ఆకుల చిట్టిబాబు, డాకూరి శంకర్, దుర్గేష్, చందర్‌ నాయక్, పీసీసీ సభ్యుడు కిషన్, మండల పార్టీ అధ్యక్షులు శివరాజ్, శేషారెడ్డి, రమేష్‌ జ్యోషి, నిమ్మ రమేష్, దిగంబర్‌రావు, దశరథ్, సతీష్, మాజీ సర్పంచ్ ఎస్.కృష్ణా రెడ్డి, మాజీ ఎంపీటీసీలు డీజీ.వెంకటేశం, మన్నె నరేందర్, మాజీ వార్డు మెంబర్‌ పి.ప్రవీణ్‌కుమార్‌లతో పాటు నాయకులు అక్బర్, ఖాజా, సైలాన్, మధు, రాజశేఖర్‌లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed