జిల్లాలో విజృంభిస్తున్న విషజ్వరాలు.. 229 డెంగీ కేసులు నమోదు

by Mahesh |
జిల్లాలో విజృంభిస్తున్న విషజ్వరాలు.. 229 డెంగీ కేసులు నమోదు
X

దిశ, సంగారెడ్డి /సంగారెడ్డి మున్సిపాలిటీ : జిల్లాలో రోజు రోజుకు విషజ్వరాలు ప్రబలుతున్నాయి. విష జ్వరాలతో పాటుగా డయోరియా, డెంగీ వ్యాధులు నమోదవుతున్నాయి. వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి జిల్లాలో విష జ్వరం బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రులలో సైతం జనాలు కిక్కిరిసిపోయారు. జిల్లాలో ఇప్పటి వరకు 229 కేసులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెంగీ కేసులు నమోదు కాగా ప్రైవేటు ఆసుపత్రులలో సుమారు 200 వరకు డెంగీ కేసులు ఉన్నట్లు అనధికారిక సమాచారం. ఇవే కాకుండా జిల్లాలో జ్వరం కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ సంవత్సరం జనవరి నెల నుంచి ఆగస్టు చివరి నాటికి జిల్లాలో 7702 మంది విష జ్వరాల బారిన పడ్డారు. ఆ కేసులతో పాటుగా ఈ సంవత్సరం కొత్తగా డయోరియా(అతిసారం) కేసులు 2,257 కేసులు నమోదయ్యాయి. వాటితో పాటుగా టైపాయిడ్ కేసులు జిల్లా వ్యాప్తంగా 1,572 కేసులు కూడా నమోదయ్యాయి. అత్యవసర కేసులు ఉంటే జిల్లా కేంద్రంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. 9494681165 నంబర్ కు కాల్ చేసి వైద్య సహాయం పొందవచ్చు.

ప్రతి ఇంట్లో జ్వరపీడితులే..

జిల్లా వ్యాప్తంగా వర్షాలు ప్రారంభం నాటి నుంచి ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు జ్వర పీడితులే. అదే విధంగా ప్రతి గ్రామం, పట్టణంలో పెద్ద ఎత్తున విష జ్వరాల బారిన పడుతున్నారు. ఎవరిని అడిగినా జ్వరం వచ్చిందని, టైఫాయిడ్ లేదా డెంగీ వచ్చిందని చెబుతున్నారు. విష జ్వరాల పడిన వారితో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రిలో రోగుల తాకిడి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతి రోజు మూడు వేల రోగుల వరకు వస్తూనే ఉన్నారు. ఎప్పుడు లేనంతగా ఈ సంవత్సరం విష జ్వరాల పడిన కేసులు అత్యధికంగా 7702 మంది బాధితులయ్యారు. జిల్లాలో ఈ సంవత్సరం కొత్తగా డయోరియా కేసులు నమోదు కావడం కొంత కలవర పరుస్తున్నది. గతంలో చాలా సంవత్సరాల క్రితం మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో అతిసారం(కలరా) వ్యాధి వ్యాపించేది. కానీ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో నమోదయ్యాయి. 2257 కేసులు నమోదయ్యాయి.

డెంగీ వ్యాధి ప్రాణాంతకం..

డెంగ్యూ జ్వరం దోమల ద్వారా సంక్రమించే వ్యాధి, మరియు రెండోసారి డెంగ్యూ వైరస్ సోకిన వ్యక్తులు తీవ్రమైన వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదం చాలా ఎక్కువ. డెంగ్యూ జ్వరం లక్షణాలు అధిక జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు. కొన్ని తీవ్రమైన కేసులు రక్తస్రావం, షాక్‌కు దారితీస్తాయి, ఇది ప్రాణాంతకమవుతుంది. డెంగ్యూ వ్యాధి లక్షణాలు కనిపిస్తే డాక్టరును సంప్రదించాలి. అలాగే వ్యాధి నివారణ చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం అని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వ ఆసుపత్రిలో 229 డెంగీ కేసులు నమోదయ్యాయి. అదే విధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరో 200 కేసులు నమోదైనట్లు అనధికారిక సమాచారం. ఇదే అదునుగా బావించిన ప్రైవేట్ ఆసుపత్రుల ధనదాయం రోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. తప్పకుండా ఎమర్జెన్సీ కేసులంటూ ఐసీయూలో ఉంచుతూ వేలకు వేలు డబ్బులు దండుకుంటున్నారు. డెంగీ వ్యాధి అంటే భయపడుతున్న ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు పోకుండా ప్రైవేటు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీనిని ఆసరా చేసుకుని ప్రైవేటు యాజమాన్యాలు పెద్ద ఎత్తున దండుకుంటున్నాయి.

డెంగ్యూ లక్షణాలు

లక్షణాలు, సాధారణంగా సంక్రమణ తర్వాత నాలుగు నుండి ఆరు రోజుల నుండి ప్రారంభమవుతాయి మరియు 10 రోజుల వరకు ఉంటాయి.ఆకస్మిక అధిక జ్వరం (105 డిగ్రీలు), తీవ్రమైన తలనొప్పి కళ్ళు వెనుక నొప్పి, తీవ్రమైన కండరాల నొప్పి, అలసట, వికారం, వాంతులు అవుతాయి. అతిసారం చర్మంపై దద్దుర్లు, ఇది జ్వరం ప్రారంభమైన రెండు నుంచి ఐదు రోజుల తర్వాత కనిపిస్తుంది. తేలికపాటి రక్తస్రావం (ముక్కు రక్తస్రావం, చిగుళ్ళలో రక్తస్రావం లేదా సులభంగా గాయాలు వంటివి)

* మొదటి దశ..

తీవ్రమైన జ్వరం, అలసట, శరీరం అంతా నీరసంగా ఉండటం, కంటిలో ఎరుపు రంగు లాంటి లక్షణాలు కనిపిస్తే కచ్ఛితంగా డాక్టరును సంప్రదించాలి.

* రెండో దశ..

పైన చూపిన లక్షణాలతో పాటు నోటి చిగుర్లలో రక్తం కారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

* మూడవ దశ: మలం, మూత్రంలో రక్తస్తావ్రం కావడం లక్షణాలు కనిపిస్తాయి. ఈ దశ రాగానే మెదడుకు వైరస్ దాడి చేసి మనిషిని చనిపోయే స్థాయికి చేరుకుంటుంది. తద్వారా వ్యక్తి ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. జిల్లా కేంద్రంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. 9494681165 నంబర్ కు కాల్ చేసి వైద్య సహాయం పొందవచ్చు.

Advertisement

Next Story

Most Viewed