KTR: కాంగ్రెస్ ప్రభుత్వమే టార్గెట్‌గా కేటీఆర్ వరుస ట్వీట్‌లు

by Ramesh Goud |
KTR: కాంగ్రెస్ ప్రభుత్వమే టార్గెట్‌గా కేటీఆర్ వరుస ట్వీట్‌లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వమే టార్గెట్ గా వరుస ట్వీట్ లు చేస్తున్నారు. నిరంతరం తన పోస్టులతో ప్రభుత్వ పనితీరును ఎండగడుతున్నారు. ప్రభుత్వ విధివిధానాలపై స్పందిస్తూ.. అధికార పార్టీ నాయకులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే సోమవారం ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్టులు పెట్టారు. ఇందులో సుంకిశాల రిటైనింగ్ వాల్ నిర్మాణం కూలిపోయిన వీడియోను పోస్టు చేస్తూ.. సుంకిశాల దుర్ఘటన జరిగి 10 రోజులకు పైగా అయ్యిందని, ఏజెన్సీ మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అంతేగాక రాహుల్ గాంధీ గారూ.. మీ ప్రభుత్వం ఏజన్సీ పట్ల ఎందుకు మెతకగా వ్యవహరిస్తోందని అంటూ.. దీనికి మీ దగ్గర ఏవైనా సమాధానాలు ఉన్నాయా? అని అడిగారు.

ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అద్భుతంగా ఉన్న వ్యవసాయరంగం కాంగ్రెస్ ప్రభుత్వంలో కుదేలైందని చెబుతూ మరో ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా.. కేసీఆర్ గారి హయాంలో రికార్డులు బద్దలు కొట్టిన రైతాంగం.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తీవ్రంగా దెబ్బతినడం గమనించదగ్గ విషయమని అన్నారు. సాగునీటిపై అనిశ్చితి, విత్తనాలు, ఎరువులు వంటి కీలకమైన ఇన్‌పుట్‌లు అందుబాటులో లేకపోవడం, కాంగ్రెస్‌ హయాంలో రైతు భరోసా పెట్టుబడికి మద్దతు లభించకపోవడం తెలంగాణ రైతులను తీవ్రంగా ప్రభావితం చేశాయని ఆరోపించారు.

ఆగస్టు 10 నాటికి, ప్రస్తుత వానకాలం సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాల్లో జరగాల్సి ఉండగా.. కేవలం 65.4 శాతం అనగా 84.6 లక్షల ఎకరాల్లో మాత్రమే నాట్లు వేయడం జరిగిందని తెలిపారు. అలాగే గత ఐదేళ్లలో వానకాలం సీజన్‌లో తెలంగాణలో అత్యల్పంగా విత్తన విస్తీర్ణం ఇదే కావచ్చని, ఫలితంగా మొత్తం పంటల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ సాధించిన స్థిరమైన అభివృద్ధిని కూడా కాంగ్రెస్ నాయకత్వం చేయలేకపోతోందని ఇది స్పష్టంగా రుజువు చేస్తోందని ఎక్స్ లో కేటీఆర్ రాసుకొచ్చారు.

Advertisement

Next Story