Kishan Reddy: ఎన్నో ఏళ్లుగా మేమూ అదే చెబుతున్నాం

by Gantepaka Srikanth |
Kishan Reddy: ఎన్నో ఏళ్లుగా మేమూ అదే చెబుతున్నాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘లిక్కర్ స్కామ్ భాగస్వామి’ అయిన కేజ్రీవాల్ ఢిల్లీలో ఓడిపోవడంతో.. బీఆర్ఎస్ పార్టీలో కలవరం మొదలైనట్లుందని కేంద్ర మంత్రి , రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్​ రెడ్డి అన్నారు. అందుకే పాత దోస్తు అయిన కాంగ్రెస్‌తో మరోసారి బహిరంగంగా జతకట్టేందుకు కేటీఆర్ బహిరంగ ఆహ్వానం పలికారని విమర్శించారు. తుష్టీకరణ రాజకీయాలు, అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ పార్టీలను మరోసారి కలిపేందుకు మజ్లిస్ పార్టీ మధ్యవర్తిత్వం చేస్తోందంటూ కిషన్​రెడ్డి ఆరోపణలు చేశారు. బీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలతో జతకట్టాలంటూ రాహుల్ గాంధీకి కేటీఆర్ సూచించడంపై కేంద్రమంత్రి, జి.కిషన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ రాజకీయ జీవితం కాంగ్రెస్ తోనే మొదలైందని, 2004లో కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల్లో గెలిచి యూపీఏ1లో కేంద్ర మంత్రి అయ్యారని కిషన్​ రెడ్డి గుర్తుచేశారు.

2014లో బీఆర్ఎస్‌ను కాంగ్రె‌స్‌లో విలీనం చేసేందుకు కూడా కేసీఆర్ సిద్ధమయ్యారని, వారిద్దరి మధ్య దోస్తీ గురించి బీజేపీ చాలాసార్లు చెప్పిందని, చాలా సందర్భాల్లో తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. కేవలం రూ.2 లక్షలకే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం 10 ఎకరాల విలువైన స్థలాన్ని అప్పనంగా అప్పగించింది కానీ పేదల ఇళ్లకోసం మాత్రం స్థలం ఇవ్వలేదంటూ విమర్శించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో.. బీజేపీని ఓడగొట్టేందుకు కూటమి ప్రభుత్వంలో చేరేందుకు సిద్ధమేననే సంకేతాలను కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పారని, దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా వంతపాడిందంటూ ద్వజమెత్తారు. కాంగ్రెస్ జెండాపై గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరి మంత్రులవుతారు, ఆ తర్వాత బీఆర్ఎస్ జెండాపై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారు, ఇద్దరి ఆలోచనలు సేమ్-టు-సేమ్ అని చెప్పేందుకు ఇంతకన్నా ఇంకా ఏం కావాలంటూ ఏద్దేవా చేశారు.

రాష్ట్రపతిగా.. గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ముని ఓడించేందుకు ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యాయని, మజ్లిస్ పార్టీ ప్రాపకం కోసం, ముస్లిం ఓట్ల కోసం.. ఉమ్మడి పౌరస్మృతి విషయంలోనూ ఇద్దరొక్కటయ్యారని గుర్తు చేశారు. 2023 ఆగస్టులో లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం విషయంలోనూ.. బహిరంగంగా చెట్టాపట్టాలేసుకుని తిరిగారని, ఢిల్లీ సర్వీసెస్ బిల్లు సందర్భంలోనూ.. జాతి ప్రయోజనాలను పక్కనపెట్టి.. ఆమ్ ఆద్మీ పార్టీకి, కాంగ్రెస్ తీర్మానానికి బీఆర్ఎస్ పార్టీ బహిరంగంగా మద్దతిచ్చిందన్నారు. ఈ రెండు పార్టీల అనైతిక పొత్తును చెప్పేందుకు ఎన్నో ఉదాహరణలున్నాయని, అలాంటిది మరోసారి బహిరంగంగా దోస్తీకి ఈ రెండు కుటుంబ పార్టీలు సిద్ధమయ్యాయని అన్నారు.

Next Story