టీడబ్ల్యూజేఎఫ్ చేయూత.. మేమున్నాం అంటూ ఆత్మీయ భరోసా

by Kalyani |   ( Updated:2025-03-13 10:28:40.0  )
టీడబ్ల్యూజేఎఫ్ చేయూత.. మేమున్నాం అంటూ ఆత్మీయ భరోసా
X

దిశ బ్యూరో, ఖమ్మం: టీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టులకు చేయూతనిస్తోంది. వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న జర్నలిస్టులు, జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకుంటోంది. దీనిలో భాగంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వెలుగు దినపత్రిక రిపోర్టర్ తిరుపతిని టీడబ్ల్యూజేఎఫ్ నేతలు తన ఇంటికి వెళ్లి గురువారం పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన కామేపల్లి మండలం ముచ్చర్లకు చెందిన జర్నలిస్టు షేక్ రంజాన్ కుటుంబ సభ్యులను కూడా వారి స్వగ్రామానికి వెళ్లి పలుకరించారు. ఇద్దరు జర్నలిస్టుల కుటుంబాలకు కూడా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.


జర్నలిస్టుల కుటుంబాలకు వితరణ..

వైద్య సేవలు పొందుతూ...తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న వెలుగు దినపత్రిక జర్నలిస్టు తిరుపతిని టీడబ్ల్యూజేఎఫ్ నేతలు పరామర్శించి ఆరోగ్య సమాచారం తెలుసుకున్నారు. అతని హెల్త్ ప్రొఫైల్ ను పరిశీలించి, మెరుగైన వైద్య సేవల విషయంలో తమ యూనియన్ ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎలాంటి విపత్కర పరిస్థితులున్నా...ఆరోగ్య సమస్యలున్నా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని టీడబ్ల్యూజేఎఫ్ నేతలు సయ్యద్ ఖదీర్ (వి6), దువ్వా సాగర్ (దిశ), కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి (నవతెలంగాణ) తిరుపతి కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించి భరోసా ఇచ్చారు.

రంజాన్ కుటుంబానికి నిత్యావసరాలు, చిరు ఆర్థిక సహాయం

ఇటీవల కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ అకాల మృతి చెందిన జర్నలిస్టు రంజాన్ కుటుంబానికి టీడబ్ల్యూజేఎఫ్ అండగా ఉంటుందని ఫెడరేషన్ నేతలు హామీ ఇచ్చారు. రంజాన్ భార్య నసీమా, పిల్లలను పరామర్శించారు. కామేపల్లి మండలం ముచ్చర్లకు చెందిన రంజాన్ ఖమ్మంలో ఛానల్ లో విధులు నిర్వహించేవారు. మూడు నెలల క్రితం ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. ప్రస్తుతం రంజాన్ మాసం కొనసాగుతున్న దృష్ట్యా ఆ కుటుంబం ఇబ్బందులు పడొద్దు అనే ఉద్దేశంతో టీడబ్ల్యూజేఎఫ్ నేతలు ఇంటికి వెళ్లి పరామర్శించారు. నిత్యావసర సరుకులు అందించారు. రంజాన్ పండుగ నేపథ్యంలో కొత్త దుస్తుల కోసం టీడబ్ల్యూజేఎఫ్ నేత ఖదీర్ చిరు ఆర్థిక సహాయం చేశారు. కన్నీరు మున్నీరవుతున్న రంజాన్ కుటుంబాన్ని ఓదార్చారు. ఎటువంటి సహాయం కావాలన్నా తమను సంప్రదించవచ్చు అని నేతల ఫోన్ నెంబర్లు ఇచ్చారు.

యూనియన్లకు అతీతంగా తమ సామాజిక సేవలు ఉంటాయని ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ నేతలు పేర్కొన్నారు. రంజాన్ ఖమ్మంలో అక్రిడేటెడ్ జర్నలిస్ట్ గా పనిచేసిన దృష్ట్యా ఆయన భౌతికంగా లేకున్నా ఆయన కుటుంబానికి ఖమ్మంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో ప్రాధాన్యత ఇచ్చేలా చూస్తామని టీడబ్ల్యూజేఎఫ్ నేతలు హామీ ఇచ్చారు. ఇరు కుటుంబాలను పరామర్శించిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్ బాధ్యులు సయ్యద్ ఖదీర్, దువ్వా సాగర్, కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, మానుకొండ రవి కిరణ్, కూరాకుల గోపి, వెగినాటి మాధవరావు, షేక్ సుభాన్, కొత్త యాకేష్, కొమిరె వెంకటేశ్వర్లు, షేక్ జానీ పాషా, గరిడేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story