రేపు ఉమ్మడి జిల్లాలో హీరో వెంకటేశ్ పర్యటన

by Disha Web Desk 11 |
రేపు ఉమ్మడి జిల్లాలో హీరో వెంకటేశ్ పర్యటన
X

దిశ, బ్యూరో, ఖమ్మం: సినీ హీరో దగ్గుబాటి వెంకటేశ్ మంగళవారం ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి రామ్ సహాయం రఘురామ్ రెడ్డి తరపున ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు వెంకటేశ్ పర్యటన వివరాలను రామసహాయం రఘురామ్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఖమ్మం మయూరి సెంటర్, పాత బస్టాండ్, జడ్పీ సెంటర్, ఇల్లెందు క్రాస్ రోడ్ వరకు రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్ ఉంటుందని వెల్లడించారు. అనంతరం రాత్రి 8 గంటలకు కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనంలో వెంకటేశ్ పాల్గొననున్నారని తెలిపారు.

వియ్యంకుని గెలుపు కోసం..

రామసహాయం రఘురామ్ రెడ్డికి ఇద్దరు కుమారులు. ఒక కుమారుడు దగ్గుబాటి వెంకటేశ్ కుమార్తెను వివాహం చేసుకోగా.. మరో కుమారుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురును వివాహం చేసుకున్నారు. ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా రఘురామ్ రెడ్డి ఖరారుకాగానే ఆయన తరఫున మంత్రి కుటుంబ సభ్యులతో పాటు, దగ్గుబాటి కుటుంబసభ్యులు కూడా ప్రచారంలో ముమ్మరంగా తిరుగుతున్నారు. ఇప్పటికే దగ్గుబాటి ఆశ్రిత, పొంగులేటి సప్నిరెడ్డి వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ తన మామయ్యను గెలిపించాల్సిందిగా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వీరితో పాటు వెంకటేశ్ కూడా స్వయంగా తన వియ్యంకుని కోసం ప్రచారం చేయాలని నిర్ణయించుకుని ఖమ్మం వస్తున్నట్లు సమాచారం. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్, ఆత్మీయ సమ్మేళనంతో ఉమ్మడి జిల్లాలో ఈ హీరో మంగళవారం సందడి చేయనున్నారు.

Next Story

Most Viewed