బీజేపీ గేమ్ లో కేసీఆర్ నాలుగో స్తంభం!.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |
బీజేపీ గేమ్ లో కేసీఆర్ నాలుగో స్తంభం!.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ,డైనమిక్ బ్యూరో: మొన్నటి ఏపీ ఎన్నికల్లో బీజేపీ తాను వెనుకుండి ఓ వైపు వైసీపీ మరో వైపు టీడీపీ, జనసేనతో కలిసి నాలుగు స్తంభాల ఆట ఆడినట్లుగానే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ గేమ్ ఆడబోతున్నదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తెలంగాణలో టీడీపీని ముందు పెట్టి ఆట ఆడాలని చూస్తే దానికి జనసేన అండగా ఉండబోతున్నదన్నారు. వీరికి బీఆర్ఎస్ జతకట్టే అవకాశం ఉందన్నారు. జైల్లో ఉన్న కూతురి బెయిల్ కోసం బీజేపీతో చేతులు కలిపి కేసీఆర్ వారికి నాలుగో స్తంభం గా మారుతారా? లేక కూతురుపై ప్రేమను కాదనుకుని బీజేపీని విభేదించి రాకీయాలు చేస్తారా అనేది తేలాల్సి ఉందన్నారు. ఏ తండ్రికైనా కూతురిపై ప్రేమ ఉంటుందని ఇది తప్పేమి కాదన్నారు. సోమవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు ఈసారి చాలా తెలివిగా విభజన సమస్యల పరిష్కారం పేరుతో ప్రభుత్వ పరంగా తెలంగాణ గడ్డపై ఎంట్రీ ఇచ్చారన్నారు. ఇది మాకూ తప్పలేదని చెప్పారు. గతంలో చంద్రబాబు తెలంగాణకు వస్తే ఎవరికి తెలిసేది కాదన్నారు. ముఖ్యమంత్రుల భేటీనిఈ భేటీని కేంద్ర మంత్రి బండి సంజయ్ సమర్థించడం ద్వారా బీజేపీ, టీడీపీ మధ్య గేమ్ ఉందనడానికి సిగ్నల్ ఇచ్చినట్లైందన్నారు. అయితే బండి సంజయ్ మాట్లాడింది మిస్ ఫైర్ అయితే దానిని సమర్థించుకోవడానికి ఈ విషయంలో కిషన్ రెడ్డి మౌనంగా ఉన్నట్లుగా తనకు తోస్తున్నదన్నారు. చంద్రబాబు బీజేపీ చేతిలో ఓ పావు అని మొన్నటి రాకతో తన అసలు రంగును బయటపెట్టారన్నారు.

బండి సంజయ్ వ్యాఖ్యలపై రియాక్ట్:

ఈడీ, సీబీఐ కేసులు ఉన్న వారిని బీజేపీలోకి చేర్చుకోమని బండి సంజయ్ అంటున్నారని కానీ ఇప్పటికే ఈడీ, సీబీఐ కేసులు ఉన్న వారిని బీజేపీ తమ పార్టీలో జాయిన్ చేసుకుందన్నారు. రెండు రాష్ట్రాలు రెండు కండ్లు అని చంద్రబాబు అంటున్నారు, హైటెక్ సిటీస సాఫ్ట్ వేర్ అభివృద్ధి నాదే అంటున్నారని కానీ హైటెక్ సిటీకి పునాది వేసింది కాంగ్రెస్ సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అన్నారు. బీజేపీ ఎన్ని వ్యూహాలు చేసినా కాంగ్రెస్ కార్యకర్తల శక్తిని చంపలేరని రాజు యుద్ధం చేసి గెలుస్తాడు సంగారెడ్డి రాజ్యానికి మళ్ళీ మా ప్రజలు గెలిపించుకుని రాజుని చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. నామినేట్ పదవులకు యోధుడు పోటీ పడడన్నారు. కేజ్రీవాల్ బీజేపీ లోంగకపోవడం వల్లే ఆయనకు బెయిల్ రావడం లేదన్నారు. బీజేపీ ఇంకా నిలబడుతుందంటే అది ఈడీ, సీబీఐ, ఐటీ లవల్లనే అన్నారు.దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ఉండకపోతే రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేవారన్నారు. మూడో సారి సీట్లు తగ్గబోతున్నాయనే ఇంటెలిజెన్స్ సమాచారంతోనే బీజేపీ ముందుగానే అప్రమత్తమైందన్నారు. అందువల్లే నార్త్ ఇండియాపై కాకుండా సౌత్ స్టేట్స్ పై దృష్టి పెట్టిందన్నారు. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లను ఫోకస్ చేసిందని ఈ మూడు రాష్ట్రాల్లో వచ్చిన రిజల్ట్స్ పైనే ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని లేదంటే ఇండియా కూటమినే ప్రభుత్వం ఏర్పాటు చేసేదన్నారు.



Next Story