బీఆర్ఎస్‌ను వెంటాడుతోన్న ‘కమ్మ’ భయం.. కొంపముంచిన KCR కామెంట్స్..!

by Disha Web Desk 19 |
బీఆర్ఎస్‌ను వెంటాడుతోన్న ‘కమ్మ’ భయం.. కొంపముంచిన KCR కామెంట్స్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ పట్ల కమ్మ సామాజిక వర్గం ఓటర్లు వ్యతిరేకంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. కొంత కాలంగా చంద్రబాబు పట్ల బీఆర్ఎస్ అనుసరిస్తున్న విధానమే అందుకు కారణమని తెలుస్తున్నది. జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్స్ ఉందని ఇటీవల కేసీఆర్ ప్రకటించడాన్ని కమ్మ సామాజిక వర్గం లీడర్లు జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తున్నది. దీంతో లోక్ సభ ఎన్నికల్లో గంపగుత్తగా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు వేసే చాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.

కేసీఆర్‌పై గుర్రుగా కమ్మ లీడర్లు..

కొంత కాలంగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు విషయంలో బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరును కమ్మ సామాజిక వర్గం లీడర్లు తప్పుపడుతున్నారు. ఈ మధ్య మాజీ సీఎం కేసీఆర్ ఓ టీవీ చానల్ డిస్కషన్‌లో ‘ఏపీలో జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది’ అని ప్రకటించారు. దీంతో జగన్ గెలుపు కోసం కేసీఆర్ పరోక్షంగా సాయపడుతున్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేసిందని గుర్తు చేస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసింది. ఈ అరెస్టును వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో ఉన్న బాబు మద్దతుదారులు, కమ్మ సామాజిక వర్గం లీడర్లు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎలాంటి నిరసనలకు అనుమతి ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నది. ఈ విషయంపై అప్పట్లోనే కమ్మ కుల పెద్దలు సమావేశమై బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరిగింది.

ఎంపీ సీటు ఇవ్వకున్నా కాంగ్రెస్‌కు సపోర్ట్

ప్రస్తుత ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ సీటును తమ సామాజిక వర్గానికి ఇవ్వాలని కమ్మ లీడర్లు చివరి వరకు కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. కానీ, స్థానిక రాజకీయ కారణాలతో ఆ సీటును రఘురామరెడ్డికి కేటాయించారు. ఈ నిర్ణయాన్ని కమ్మ లీడర్లు అందరూ తప్పుపట్టారు. దీంతో ఈ ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం లీడర్లు కాంగ్రెస్‌కు సహకరిస్తారా..? లేదా..? అనే అనుమానాలు నెలకొన్నాయి. కానీ బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుతో ఆ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు సపోర్ట్ ఇవ్వకుండా, కాంగ్రెస్ అభ్యర్థి వైపు మొగ్గుచూపుతున్నట్టు టాక్ ఉంది.

Next Story