- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఐకేపీ కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచాలి: లోకేష్ కుమార్

దిశ, తెలంగాణ బ్యూరో: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సెర్ప్ ద్వారా 33 శాతం ఉన్న ఐకేపీ కొనుగోలు కేంద్రాల సంఖ్య 50 శాతానికి పెంచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ అన్నారు. ధాన్యం కొనుగోలు, పాఠశాల విద్యార్థుల యూనిఫామ్స్, పెట్రోల్ బంకుల నిర్వహణ తదితర కార్యక్రమాల ద్వారా స్వయం సహాయక మహిళా సంఘాలు ఆర్థికంగా మరింత బలోపేతం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి సెర్ఫ్ సీఈఓ దివ్య తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, డిఆర్డిఓ,సెర్ఫ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ కుమార్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నిర్వహణలో భాగంగా ఐకెపి మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన పెండింగ్ లో ఉన్న కమిషన్ ను సమీక్షించాలని, కమిషన్ మొత్తాన్ని 10% జిల్లా సమాఖ్యలు, 90% గ్రామ సమస్యలకు వెళ్లేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. గన్ని బ్యాగుల సమీకరణ చేయాలని, భవిష్యత్తులో ప్రభుత్వం ప్రతి మండల కేంద్రంలో మహిళ సంఘాల ద్వారా గోడౌన్లతో పాటు, రైస్ మిల్లుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నందున్న కొనుగోలులో మహిళా సంఘాలు చురుకుగా పాల్గొనేలా చూడాలన్నారు. పౌర సరఫరాల శాఖ, సెర్ఫ్ సమన్వయంతో భారత ఆహార సంస్థకు బియ్యం సరఫరా చేసే దిశగా కార్యాచరణ తయారు చేసుకోవాలని అన్నారు. దివ్యాంగులకు యూ.డి.ఐ.డి. కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించి దివ్యాంగులకు నిర్ధారణ పరీక్షల నిర్వహణ కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభించాలని అన్నారు. నిర్ధారణ క్యాంపుల నిర్వహణ కోసం ఆసుపత్రిలో అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ లకు సూచించారు. దివ్యాంగులకు ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరమైన వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని, అవసరమైన నిధులు విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. కుటుంబంలో వృద్ధాప్య పింఛన్ పొందుతున్న వృద్దులు ఎవరైనా మరణిస్తే, వారి జీవిత భాగస్వామికి అర్హత ఉంటే వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని కలెక్టర్ లకు సూచించారు. డిఆర్డిఓ, ఎంపిడిఓ, పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్ కమీషనర్లతో సమావేశం నిర్వహించి ఇటువంటి కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. చనిపోయిన కేసుల విషయంలో పూర్తిగా పరిశీలన చేసిన తర్వాతే నిర్ధారణకు రావాలన్నారు.
యునిఫాం, పెట్రోల్ బంక్లపై దృష్టి సారించాలి:
ప్రతి ప్రభుత్వ పాఠశాలను స్వశక్తి మహిళా సంఘాలతో ట్యాగింగ్ చేసి స్కూల్ యూనిఫాం కుట్టు ప్రక్రియ సకాలంలో జరిగేలా చూడాలని, జూన్ నెల వరకు ఈ పనులు పూర్తి కావాలని అన్నారు. స్కూల్ యూనిఫామ్ కుట్టు పనులకు సంబంధించి కూలీ క్రింద 50 రూపాయలు మాత్రమే వచ్చినట్లు మహిళా సంఘాల సభ్యులు చెబుతున్నారని, దీనిని క్షేత్రస్థాయిలో కలెక్టర్లు పరిశీలన చేసి పెండింగ్ చెల్లింపులకు సంబంధించిన బిల్లులు సమర్పించేలా చూడాలని, ప్రభుత్వానికి సమర్పించిన ప్రతి బిల్లు చెల్లింపు పూర్తవుతుందని అన్నారు. స్వశక్తి మహిళ సంఘాల ద్వారా సృష్టించబడిన స్టిచ్చింగ్ సెంటర్ లు పూర్తి స్థాయిలో వినియోగించేలా ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలకు యూనిఫామ్ కుట్టిన తర్వాత ప్రైవేట్ గా కూడా కుట్టు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మహిళా సంఘాల ద్వారా జిల్లా స్థాయిలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు అనువైన భూములు గుర్తించాలని అధికారులకు సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాలు, మండల కేంద్రాల స్థాయిలలో కూడా పెట్రోల్ బంకుల ఏర్పాటుకు కార్యాచరణ ఉంటుందన్నారు. మహిళలచే చేపట్టే పెట్రోల్ బంక్ లలో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్, పిల్లలు ఆడుకునేందుకు ఆట స్థలం, క్యాంటీన్, చిన్న హోటల్ ఏర్పాటు చేసేందుకు వీలుగా ఉండాలని అన్నారు. జిల్లా సమాఖ్య భవన నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. ఇందిరా మహిళా శక్తి బజార్ కింద షాప్స్ ఏర్పాటుకు ప్రతి జిల్లాకు లక్ష్యాలు నిర్దేశించడం జరిగిందని అన్నారు. ఇందిరా మహిళా శక్తి బజార్ లలో ప్రజలకు అవసరమైన సామాగ్రి అందుబాటులో ఉండాలని, బజార్ ఎల్లప్పుడూ ప్రజలతో కిటకిటలాడేలా ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లాలలో వివిధ సమయాలలో నిర్వహించిన తనిఖీలలో అవకతవకలు గమనించి లైసెన్స్ రద్దు చేసిన పెట్రోల్ బంక్ లను మహిళా సంఘాలకు కేటాయించాలని అన్నారు. మహిళా సంఘాల సభ్యులకు ప్రమాద బీమా, సాధారణ బీమా పథకం ప్రభుత్వం అమలు చేస్తుందని, మరణించిన మహిళా సంఘాల సభ్యుల సరైన డాక్యుమెంట్ లను పరిశీలించి సరైన లబ్ధిదారులకు ఈ సహాయం అందేలా చూడాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించి జిల్లాలో ఎంతమంది మహిళా సంఘాల సభ్యులు మరణించారు, వారిలో ఎంత మందికి ప్రమాద బీమా, సాధారణ భీమా అమలు అవుతుంది పరిశీలించి సంబంధిత లబ్ధిదారులకు సహాయం అందజేయాలని అన్నారు.