Jupally Krishna Rao : 5కే రన్ ను ప్రారంభించిన మంత్రి జూపల్లి

by Sumithra |   ( Updated:2025-03-16 05:24:59.0  )
Jupally Krishna Rao : 5కే రన్ ను ప్రారంభించిన మంత్రి జూపల్లి
X

దిశ, శేరిలింగంపల్లి : ప్రతిరోజు వ్యాయామం చేయడం ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ తులసి వనం వద్ద అవని స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు శిరీష సత్తూర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5కే రన్ ను టూరిజం శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన చిన్న జీవితంలో ఏ పని చేయాలన్నా ఆరోగ్యం ప్రధానమని.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం నిత్యం వ్యాయామం చేయాలన్నారు.

ఇలాంటి సామాజిక కార్యక్రమాలు తరచూ చేపడుతుండాలని అవని ఫౌండేషన్ అధ్యక్షురాలు శిరీష సత్తూర్ కు సూచించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్న సంస్థలకు తోడ్పాటును అందించాలని ఆయన కోరారు. ఈ 5కె రన్ లో మహిళలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్, కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్, హఫీజ్ పేట్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Next Story

Most Viewed