నిరుద్యోగులు డిమాండ్లు సాధించే దాకా వదిలిపెట్టం.. టీజీపీఎస్సీ ముట్టడిపై హరీష్ రావు ట్వీట్

by Ramesh N |
నిరుద్యోగులు డిమాండ్లు సాధించే దాకా వదిలిపెట్టం.. టీజీపీఎస్సీ ముట్టడిపై హరీష్ రావు ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిరుద్యోగులు టీజీపీఎస్సీ ముట్టడిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆసక్తికర ట్వీట్ చేశారు. హామీలు ఇచ్చి, మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా, డిమాండ్ల సాధనే లక్ష్యంగా టీజీపిఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం హేయమైన చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని తెలిపారు. సోకాల్డ్ ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా నిరుద్యోగులకు లేదా? తమ గోసను రిప్రజెంటేషన్ ద్వారా చెప్పుకునే అవకాశం కూడా లేదా? అని ప్రశ్నించారు.

ఒక వైపు ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ, నిరుద్యోగుల గొంతులను, హక్కులను అణగదొక్కే కుట్రలకు రేవంత్ సర్కారు పాల్పడుతున్నదని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ ప్రజాపాలన కాదు. "అప్రజాస్వామ్యపాలన" అని విమర్శించారు. ఉద్యోగాల కోసం పుస్తకాలు పట్టుకొని చదవాల్సిన విద్యార్థులను నడిరోడ్డుకు ఈడ్చి ధర్నాలు, ఆందోళనలు చేసే దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖం తిప్పుకుంటే విద్యార్థులకు నిరుద్యోగులకు తోడు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

సమస్యలు పరిష్కరించే దాక, డిమాండ్లు సాధించే దాకా వదిలిపెట్టమని, విద్యార్థులు, నిరుద్యోగుల తరుపున గొంతెత్తుతామన్నారు. నిర్వారామ పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగుల అరెస్టులను తక్షణం నిలిపివేయాలని, నిర్బంధించిన వారిని, అరెస్టులు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని వెల్లడించారు.

Next Story

Most Viewed