CM Revanth: కేంద్రం నిబంధనలే అందుకు కారణం

by Gantepaka Srikanth |
CM Revanth: కేంద్రం నిబంధనలే అందుకు కారణం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల కురిసిన వర్షాలు, వచ్చిన వరదలతో సుమారు రూ. 10,320 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా రోడ్ల డ్యామేజీకే రూ. 7,693 కోట్లను ఖర్చు చేయాల్సి వస్తున్నదని స్పష్టత ఇచ్చింది. లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగిందని, పొలాల్లో బండరాళ్లు, కంకర, మట్టి మేటలు వేయటంతో రైతులు కోలుకోలేనంతగా నష్టాల్లో కూరుకుపోయారని ప్రభుత్వం పేర్కొన్నది. వరద నష్టంపై అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర నిపుణుల (అధికారుల) బృందం రెండు రోజుల పాటు ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట తదితర జిల్లాల్లో పర్యటించిన వచ్చిన తర్వాత సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరమైన నివేదికను అందజేశారు. ఆ నివేదికలో ఏయే శాఖకు సంబంధించి ఎంత నష్టం జరిగిందో గణాంకాలను పేర్కొన్నారు. ప్రజలను ఆదుకోడానికి ఎలాంటి షరతులు లేకుండా కేంద్రం నుంచి ఆర్థిక సాయాన్ని అందించాలని కోరారు.

నష్టపోయిన తెలంగాణకు తక్షణమే నిధులను విడుదల చేయాలని, ప్రస్తుతం కొనసాగుతున్న సహాయ పునరావాస, మరమ్మత్తు చర్యలకు వాడుకునేందుకు సహకరించాలని కేంధ్ర బృందానికి సీఎం రేవంత్ రిక్వెస్టు చేశారు. విపత్తు సమయాల్లో నిధుల వినియోగంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కఠినమైన నిమంధనలను సడలించాలని కేంద్ర బృందానికి సూచిస్తూనే ఇప్పుడు రాష్ట్రం దగ్గర ఉన్న రూ. 1,350 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధుల్లో ఒక్క రూపాయిని కూడా వాడుకోలేని నిస్సహాయ పరిస్థితి నెలకొన్నదన్నారు. ఇప్పుడున్న నిబంధనల దృష్ట్యా రాష్ట్రం మొత్తం మునిగిపోయినా ఆ నిధులను వాడుకోలేమని, ఒక కిలోమీటర్ రోడ్డు దెబ్బతింటే కేవలం లక్ష రూపాయలను మాత్రమే ఖర్చు చేసేలా ఆ గైడ్‌లైన్స్ ఉన్నాయని, ఈ కారణంగా తాత్కాలిక మరమ్మత్తు పనులు కూడా చేపట్టే పరిస్థితి లేదని వివరించారు. ఇక్కడ అమల్లో ఉన్న ఎస్ఎస్ఆర్ రేట్ల వివరాలను కూడా కేంద్రానికి నివేదిస్తామని, వాటిని పరిశీలించి విపత్తు సాయం అందించాలని కోరారు.

ప్రస్తుతానికి వివిధ శాఖల అధికారులు రూపొందించిన అంచనా నివేదిక ప్రకారం రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టం రూ. 10,320 కోట్లుగా తేలిందని, ఇంకా సమగ్రమైన వివరాల కోసం కసరత్తు జరుగుతూ ఉన్నదని కేంద్ర బృందానికి సీఎం తెలిపారు. వాతావరణ కేంద్రం హెచ్చరికలతో సకాలంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైందని, ఈ కారణంగా ప్రాణనష్టాన్ని భారీగా తగ్గించగలిగామన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో తనతో పాటు మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు భరోసా కలిగించామన్నారు. వేలాది ఇండ్లు దెబ్బతిన్నాయని, చాలా చోట్ల రహదారులు, రోడ్లు, కల్వర్టులు, చెరువులు కొట్టుకుపోవటంతో నష్టం ప్రాథమిక అంచనాలను మించిపోయిందన్నారు. ఖమ్మం పట్టణంలో మున్నేరు వాగుతో ఉండే వరద ముప్పును నివారించేందుకు రిటైనింగ్ వాల్‌ను నిర్మించడమే శాశ్వత పరిష్కారమని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. ఇందుకు కేంద్రం తగినన్ని నిధులు కేటాయించేలా చూడాలని ఆ బృందానికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాను భరించేందుకు సిద్ధంగా ఉందని క్లారిటీ ఇచ్చారు.

ఈ జిల్లాలోని రాకాసి తండా, సత్యనారాయణ తండాతో పాటు లోతట్టు ప్రాంతాల్లోని గిరిజన, ఆదివాసీ ఆవాసాలకు చెందిన ప్రజలను ప్రస్తుతానికి సహాయక శిబిరాలకు తరలించామని, వారికి శాశ్సత నివాస వసతి కల్పించేందుకు సమీపంలో సురక్షితంగా ఉండే ప్రాంతంలో ఇళ్లను కేటాయిస్తామని తెలిపారు. ఆ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన సాయాన్ని అందించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించిన తర్వాత ఆదుకోవటం కంటే, నివారించే చర్యలపైనే ఎక్కువ దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. వర్షపాతం, హీట్ వేవ్ లాంటి వాతావరణం, పర్యావరణానికి సంబంధించిన విపత్తులపై వీలైనంత ముందుగానే హెచ్చరికలు జారీచేసేలా ఎక్కువ దృష్టి సారించాలని కేంద్ర బృందానికి ముఖ్యమంత్రి సూచించారు.

భవిష్యత్తులో వరదలు వచ్చినప్పుడు ఆదుకునేందుకు, తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న పోలీసు బెటాలియన్లను ఉపయోగించుకుంటామని సీఎం తన ఆలోచనలను కేంద్ర బృందంతో పంచుకున్నారు. ప్రతి బెటాలియన్‌లో ఎంపిక చేసిన వంద మందికి ప్రత్యేక శిక్షణను అందిస్తామని, వారికి అవసరమైన పరికరాలు, శిక్షణ, నైపుణ్యం కల్పించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సాయాన్ని కోరుతున్నామన్నారు.

మేడారం అటవీ ప్రాంతంలో ఇటీవల దాదాపు 50 వేల ఎకరాల్లో చెట్లు నేలమట్టమైన సంఘటన సమావేశంలో చర్చకు వచ్చింది. అటవీ ప్రాంతంలో జరిగినందున ప్రజలకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని, మైదాన ప్రాంతంలో జరిగితే భారీ ప్రమాదం వాటిల్లేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అప్పటికే ఈ దృశ్యాలను ఫోటో ఎగ్జిబిషన్‌లో చూసిన కేంద్ర బృందం... దేశంలో ఇప్పటివరకు ఇలాంటి సంఘటన జరిగినట్లు తమ దృష్టికి రాలేదని అభిప్రాయపడింది. అందుకే కేంద్రం నుంచి పర్యావరణ విభాగానికి చెందిన నిపుణుల బృందాన్ని పంపించి శాస్త్రీయంగా అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి కోరారు. అలాంటి సంఘటనలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పరిశీలించాలని సూచించారు.

ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర అధికారుల బృందం రెండు టీమ్‌లుగా విడిపోయి రెండు రోజులుగా ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించింది. భారీ వర్షాలతో వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించింది. ఎన్డీఎంఏ సలహాదారు కల్నల్ కేపీ సింగ్ సారధ్యంలో ని ఈ బృందంలో కేపీ సింగ్‌తో పాటు శాంతినాథ్ శివప్ప, మహేష్ కుమార్, నాయల్ కాన్సన్, రాకేష్ మీనా, శశివర్ధన్ రెడ్డి ఉన్నారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, సీఎం సలహదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed