CM Revanth Reddy: ఎమ్మార్ ప్రాపర్టీస్ ప్రాజెక్టులపై లీగల్ ఏజెన్సీ.. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

by Prasad Jukanti |
CM Revanth Reddy: ఎమ్మార్ ప్రాపర్టీస్ ప్రాజెక్టులపై లీగల్ ఏజెన్సీ.. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ (Emaar Properties) చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు సుదీర్ఘ కాలంగా పెండింగ్ పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారాన్ని పరిష్కరించేందుకు 2015 లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి అదనంగా న్యాయ నిపుణులతో కూడిన మరో కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా సూచించారు. న్యాయ వివాదాలను అధ్యయనం చేయడానికి, సామరస్య పూర్వక పరిష్కారం చేసుకోవడానికి యూఏఈ ప్రభుత్వ ఆమోదంతో ఒక లీగల్ ఏజెన్సీని (Legal Agency) ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతినిధులు చేసిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి అమోదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ ఆ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి తదుపరి సూచనలు, సలహాలు అందిస్తుందని చెప్పారు. వివిధ కేసులతో పెండింగ్ లో ఉన్న తమ ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించాలని కోరుతూ దుబాయ్‌కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది.

గురువారం సచివాలయంలో (Telangana Secretariat) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu)తో ఎమ్మార్ ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ అలీ రషీద్ అలబ్బర్ నేతృత్వంలో భారత్‌లో యూఏఈ మాజీ రాయబారి డాక్టర్ అహ్మద్ అల్ బన్నా, ఎమ్మార్ గ్రూప్ సీఈవో అమిత్ జైన్, ఆ కంపెనీ ఇంటర్నేషనల్ అఫైర్స్ హెడ్ ముస్తఫా అక్రమ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఉమ్మడి రాష్ట్రం నాటి ప్రాజెక్టులు..:

2001లో ఉమ్మడి రాష్ట్రంలో దుబాయ్‌కి (Dubai) చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ హైదరాబాద్‌లో కన్వెన్షన్ సెంటర్, హోటల్, గోల్ఫ్ కోర్సు, విల్లాల నిర్మాణం తదితర ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు అప్పటి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంది. ఆనాటి ఏపీఐఐసీతో ఆ సంస్థ చేసుకున్న ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని అప్పట్లో సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. ఏజెన్సీల దర్యాప్తులు, కోర్టుల్లో విచారణలు కొనసాగుతున్నాయి. అయితేతెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 అక్టోబర్‌లో అప్పటి ప్రభుత్వం ఎమ్మార్ కు సంబంధించిన ప్రాజెక్టుల వివాదాల పరిష్కారానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సారధ్యంలో అయిదుగురు కార్యదర్శుల స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు కేంద్ర విదేశాంగ శాఖ, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ఎమ్మార్ ప్రతినిధులతో జరిగిన తాజా చర్చల సందర్భంగా ఈ వివరాలన్నింటినీ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. వివిధ దర్యాప్తు ఏజెన్సీల కేసులు, చార్జీషీట్లు, న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున ఎమ్మార్ ఒప్పందాల డాక్యుమెంట్లు, కోర్టు కేసుల వివరాలతో పాటు కేంద్ర ప్రభుత్వ సూచనలన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Next Story

Most Viewed