'బుకింగ్ టోకెన్ పై బార్ కోడ్ తప్పనిసరి'

by D.Reddy |
బుకింగ్ టోకెన్ పై బార్ కోడ్ తప్పనిసరి
X

దిశ, సిటీబ్యూరో : ఒక ట్యాంకర్ నీటిని నింపుకుని బయటికెళ్లేందుకు 5 నుంచి 8 నిమిషాలు పడుతుందని, దీనిని 5 నిమిషాలకు తగ్గించాలని, అప్పుడే మెరుగైన సేవలందించడానికి అవకాశముందని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. ప్రతి ఫిల్లింగ్ స్టేషన్ సీసీ కెమెరా నిఘాలో ఉంటుందని, ఈ కెమెరాలు హెడ్ ఆఫీసుకు అనుసంధానం చేసి ప్రతి కదలికను గమనిస్తుంటామన్నారు. ప్రతి ట్యాంకర్ బుకింగ్ టోకెన్ పై బార్ కోడ్ తప్పనిసరిగా ఉండాలని, అవినీతిపై కఠిన చర్యలు ఉంటాయని అశోక్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలోని ఫిల్లింగ్ స్టేషన్‌ను ఆయన సందర్శించారు. ట్యాంకర్ ఫిల్లింగ్, టోకెన్ జనరేషన్ వివరాలు తనిఖీ చేశారు. ఇక్కడ ప్రస్తుతం ఉన్న 3 ఫిల్లింగ్ స్టేషన్లతో మరో 3 ఫిల్లింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. డిమాండ్‌ను బట్టి ట్యాంకర్ల సంఖ్యను సైతం పెంచుకోవాలని సూచించారు.

5 నిమిషాలే..

గతేడాది లాగే భూగర్భ జలాలు అడుగంటడంతో ట్యాంకర్ బుకింగ్ పెరిగే అవకాశం ఉందని, దానికి అనుగుణంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఒక ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ లోపలికి వచ్చి.. నీటిని నింపుకొని బయటికి వెళ్లేందుకు దాదాపు 8 నుంచి 10 నిమిషాలు పడుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. ఈ సమయాన్ని 5 నిమిషాలకు తగ్గిస్తే ఒకరోజులో రెట్టింపు ట్రిప్పులను డెలివరీ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సమయాన్నే తగ్గించుకోవడానికి అన్ని ఫిల్లింగ్ స్టేషన్ల పరిసరాల్లో పలు మార్పులు చేర్పులు చేయాలని సూచించారు.

అంతర్గత రోడ్లు..

ట్యాంకర్ వచ్చి వెళ్లడానికి మంచి అంతర్గత రోడ్లను నిర్మించుకోవాలని, ఫిల్లింగ్ బే (ట్యాంకర్లలో నీరు నింపే ప్రాంతం) సరైన విధంగా ఉండేలా చూసుకోవాలన్నారు. అలాగే ఎక్కువ ట్యాంకర్లు బుక్ అయ్యే ఫిల్లింగ్ స్టేషన్‌లో అదనపు ఫిల్లింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. పగటి సమయంలో గృహ వినియోగదారులకు, రాత్రి వేళల్లో హాస్టళ్లు, హోటళ్ల వంటి వాణిజ్య వినియోగదారులకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. దీని వల్ల వెయిటింగ్ పిరియడ్, పెండెన్సీ తగ్గించవచ్చన్నారు.

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు..

ట్యాంకర్ బుకింగ్‌లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ట్యాంకర్ టోకెన్ పై బార్ కోడ్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. దీని వల్ల ట్రిప్పుల లెక్కలు పక్కాగా ఉంటాయన్నారు. మరుగుదొడ్లు, వెయిటింగ్ రూమ్‌లు లేని ఫిల్లింగ్ స్టేషన్లలో వాటిని ఏర్పాటు చేయాలని చెప్పారు. రాత్రి సమయంలో లైటింగ్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రతి ఫిల్లింగ్ స్టేషన్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు ఎండీ తెలిపారు. ఇవి ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి అనుసంధానమై ఉంటాయన్నారు. దీని వల్ల ప్రతి కదలికను పర్యవేక్షిస్తున్నట్టు గుర్తు చేశారు.


Next Story

Most Viewed