సీతక్క మీ పేరుతో అక్రమాలకు తెగబడుతున్నారు: సిర్పూర్ ఎమ్మెల్యే లేఖ

by Disha Web Desk 12 |
సీతక్క మీ పేరుతో అక్రమాలకు తెగబడుతున్నారు: సిర్పూర్ ఎమ్మెల్యే లేఖ
X

దిశ, ఆదిలాబాద్ బ్యూరో: సిర్పూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అక్రమ వసూళ్లు, దందాలకు పాల్పడుతున్నారని దానికి మీ పేరు వాడుకుంటున్నారని మంత్రి సీతక్కకు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం మంత్రి సీతక్కకు బహిరంగ లేఖ రాశారు. అక్రమాలకు కేరాఫ్‌గా ఉన్న కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తన దో నెంబర్ దందాలను కొనసాగించడం, నిత్యాన్నదాన సత్రానికి ఫండ్ వసూలు చేయడం ప్రారంభించాడని పేర్కొన్నారు. దీనికి అతని మేనల్లుడు, నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి రావి శ్రీనివాస్ అన్ని విధాలా సహకరిస్తూ మీ పార్టీని అప్రతిష్టపాలు చేస్తున్నాడని లేఖలో వివరించారు. మామ, అల్లుళ్ళ ఆగడాలు అరికట్టాలని కోరారు.. ఆ లేఖ పూర్తి సారాంశం ఇది..

గౌరవనీయులైన సీతక్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి బహిరంగ లేఖ

సిర్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు అధికార పార్టీ పేరుతో పాటు తమరి పేరును వాడుకుని నియోజకవర్గంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అక్రమ దందాలకు మారుపేరుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం మీకు తెల్సిందే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇతని మేనల్లుడు రావి శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో వీరిద్దరు చేసిన అక్రమాల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని సమయంలో మీరు ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదాలో మీరు వీరి అక్రమాల గురించి స్వయంగా తెలుసుకున్నారు.

గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న కోనేరు కోనప్ప అధికార పార్టీ పేరుతో నియోజకవర్గంలో చేయని ధో నెంబర్ దందా లేదు. అంతేకాకుండా వ్యాపారులను, అధికారులను బెదిరించి అక్రమ వసూళ్లకు కూడా పాల్పడ్డారు. అతని అన్నదాన సత్రం నడవడానికి ఫండ్ పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. ఎన్నికలలో ఓటమి అనంతరం అతని నిత్యాన్నదాన సత్రాన్ని మూసివేశారు. ఇతని దో నెంబర్ దందాలు మళ్లీ యదాతథంగా కొనసాగడానికి అధికార పార్టీ అండదండలు అవసరమని భావించి మళ్లీ కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరారనేది బహిరంగ రహస్యమే. ఇది మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు.

ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో అప్పటి నుండే తన దో నెంబర్ దందాలను కొనసాగించడం, నిత్యాన్నదాన సత్రానికి ఫండ్ వసూలు చేయడం ప్రారంభించాడు. దీనికి అతని మేనల్లుడు, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి రావి శ్రీనివాస్ అన్ని విధాలా సహకరిస్తూ మీ పార్టీని అప్రతిష్టపాలు చేస్తున్నారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు కూడా వారికి కలిసివచ్చాయి. ఈ ఎన్నికల సందర్భాన్ని, తమరి పేరును వాడుకొని అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నారు. దీనికి ఉదాహరణ కూడా మీ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాను.

కాగజ్నగర్ పట్టణానికి చెందిన ఒక స్త్రీ వైద్య నిపుణురాలిని బెదిరింపులకు గురి చేసి లోక్ సభ ఎన్నికల ఫండ్ కావాలని, మంత్రి సీతక్క అడగమని చెప్పారంటూ మీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ వైద్యురాలు నా వద్దకు వచ్చి తన ఆవేదన చెప్పుకోవడంతో మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ఇదొక్కటే కాదు. ఇలాంటి సంఘటనలు మరెన్నో ఉన్నాయి. ఈ నేతల తీరుతో నియోజకవర్గంలోని ఏడు మండలాలలోని చిన్నా చితకా అధికార పార్టీ లీడర్లు కూడా ఇదే విధంగా అక్రమ వసూళ్లకు తెగించారు. ఈ విషయంలో మీరు జాగ్రత్త వహించి ఈ మామా అల్లుళ్ల అరాచకాలను, అక్రమ వసూళ్లను అరికట్టి ప్రజలకు ఉపశమనం కలిగించాలనే ఉద్దేశ్యంతో ఈ లేఖ రాస్తున్నాను.

Next Story