డీజీపీ మకాం మావోయిస్టుల కోసమేనా?

by  |
డీజీపీ మకాం మావోయిస్టుల కోసమేనా?
X

దిశ, ఆదిలాబాద్: మావోయిస్టు పార్టీ అగ్రనేతల లొంగుబాటు పరిణామాలు రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠకు దారితీస్తున్నాయి. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటన కూడా ఇందులో భాగమేనని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోలీసులకు సైతం అంతుచిక్కని రీతిలో డీజీపీ మహేందర్ రెడ్డి విజిట్ పోలీసు వర్గాలతో సహా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.

మావోయిస్టు అగ్రనేత గణపతి‌తో పాటు ఆ పార్టీ సీనియర్లు మల్లోజుల వేణుగోపాల్, కటకం సుదర్శన్ తదితరులు ప్రభుత్వానికి లొంగి పోతారన్న సమాచారం మేరకు అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే డీజీపీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. బుధవారం ఆసిఫాబాద్ చేరుకున్న మహేందర్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో ఆదిలాబాద్ అడవులపై ఏరియల్ సర్వే నిర్వహించారు.

కాగా, కొందరు సీనియర్ పోలీసు అధికారుల అభిప్రాయం మేరకు గురువారం ఆసిఫాబాద్‌లో గణపతి కుటుంబీకులు డీజీపీతో సమావేశం అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు జిల్లాకు చెందిన మావోయిస్టు సీనియర్ నేత కటకం సుదర్శన్‌తో పాటు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ కూడా గురువారం డీజీపీ సమక్షంలో లొంగి పోయే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే అగ్రనేతల లొంగుబాటు అసత్య ప్రచారం అని మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న వెల్లడించడం గమనార్హం.

అయితే, డీజీపీ ఆసిఫాబాద్‌లో మకాం వేయడం పై పోలీసు వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కదలికలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. అణచివేత కార్యక్రమంలో భాగంగానే ఆయన జిల్లా పర్యటనకు వచ్చారని స్థానిక పోలీసులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాకు చెందిన సీనియర్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా డీజీపీ చేపట్టిన పర్యటన, ఏరియల్ సర్వే పై డిపార్ట్‌మెంట్‌లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మరోవైపు లొంగు బాటు అయ్యేందుకు సిద్ధంగా ఉన్న ఉన్న సీనియర్ నేతలు గురువారం ఆసిఫాబాద్‌కు చేరుకునే అవకాశం ఉందని… అక్కడి నుంచి హైదరాబాద్ లేదా వారిని ఢిల్లీకి తీసుకెళ్తున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఇటువంటి పరిణామల దృష్ట్యా డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.


Next Story