చరిత్ర సృష్టించిన పాక్‌ బ్యాటర్‌.. తొలి క్రికెటర్‌‌గా..

by Vinod kumar |
చరిత్ర సృష్టించిన పాక్‌ బ్యాటర్‌.. తొలి క్రికెటర్‌‌గా..
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పాకిస్తాన్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ సౌద్‌ షకీల్‌ చరిత్ర సృష్టించాడు. శ్రీలంకలో డబుల్‌ సెంచరీ (208 నాటౌట్‌) సాధించిన తొలి పాకిస్తాన్‌ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో శ్రీలంకలో అత్యధిక స్కోర్‌ రికార్డు మహ్మద్‌ హఫీజ్‌ (196) పేరిట ఉండేది. కెరీర్‌లో ఆడుతున్నది ఆరో టెస్ట్‌ మ్యాచే అయినా ఎంతో అనుభవజ్ఞుడిలా బ్యాటింగ్‌ చేసిన షకీల్‌.. వ్యక్తిగత రికార్డుతో పాటు టెయిలెండర్ల సహకారంతో తన జట్టుకు పరుగులు సమకూర్చాడు. షకీల్‌ సూపర్‌ డబుల్‌ సెంచరీతో చెలరేగడంతో పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 461 పరుగులకు ఆలౌటైంది.

శ్రీలంక బౌలర్లలో రమేశ్‌ మెండిస్‌ 5 వికెట్లతో చెలరేగగా.. ప్రభాత్‌ జయసూర్య 3, విశ్వ ఫెర్నాండో, కసున్‌ రజిత తలో వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. ధనంజయ డిసిల్వ (122) సెంచరీ చేయగా.. ఏంజెలో మాథ్యూస్‌ (64) రాణించాడు. పాక్‌ బౌలర్లలో షాహీన్‌ అఫ్రిది, నసీం షా, అబ్రార్‌ అహ్మద్‌ తలో 3 వికెట్లు, అఘా సల్మాన్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.

Advertisement

Next Story

Most Viewed