ద్రవిడ్ తనయుడు వచ్చేస్తున్నాడు.. అండర్-19 జట్టుకు ఎంపికైన సమిత్ ద్రవిడ్

by Harish |
ద్రవిడ్ తనయుడు వచ్చేస్తున్నాడు.. అండర్-19 జట్టుకు ఎంపికైన సమిత్ ద్రవిడ్
X

దిశ, స్పోర్ట్స్ : భారత దిగ్గజ క్రికెటర్, మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్ భారత అండర్-19 జట్టులో చోటు సంపాదించాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియా-19 జట్టుతో జరగబోయే మల్టీ ఫార్మాట్ సిరీస్‌కు అతను ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 7 వరకు ఆసిస్-19 జట్టుతో భారత అండర్-19 జట్టు మూడు వన్డేల సిరీస్, రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌కు జూనియర్ సెలెక్షన్ కమిటీ శనివారం వేర్వేరు జట్లను ప్రకటించింది. వన్డే సిరీస్‌కు మహ్మద్ అమన్(ఉత్తరప్రదేశ్) సారథిగా ఎంపికవ్వగా.. నాలుగు రోజుల మ్యాచ్‌ల్లో జట్టును సోహం పట్వార్ధన్(మధ్యప్రదేశ్) నడిపించనున్నాడు.

పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన సమిత్ ద్రవిడ్ రెండు జట్లకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం సమిత్ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్(కేఎస్‌సీఏ) నిర్వహించే మహారాజా టీ20 ట్రోఫీలో మైసూర్ వారియర్స్‌కు ఆడుతున్నాడు. 7 ఇన్నింగ్స్‌ల్లో 82 పరుగులే చేశాడు. బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే, ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన కూచ్ బెహార్ ట్రోఫీలో మాత్రం సత్తాచాటాడు. కర్ణాటక జట్టు తొలి టైటిల్ గెలవడంలో సమిత్ కీలక పాత్ర పోషించాడు.

8 మ్యాచ్‌ల్లో 362 పరుగులు చేయడంతోపాటు 16 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు, ఆసిస్‌తో సిరీస్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. పుదుచ్చేరి వేదికగా సెప్టెంబర్ 21, 23, 26 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరగనుండగా.. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 7 వరకు రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లకు చెన్నయ్ ఆతిథ్యమివ్వనుంది.

Advertisement

Next Story

Most Viewed