రివర్స్ పంపింగ్‌.. రూ.20కోట్లు నీళ్ల పాలు!

by  |
రివర్స్ పంపింగ్‌.. రూ.20కోట్లు నీళ్ల పాలు!
X

అధికారుల తొందరపాటు చర్యతో రూ.20 కోట్ల ప్రజాధనం నీళ్లపాలయింది. ముందుగా నిర్ణయించిన ప్లాన్ అమలు చేయడంలో విఫలం కావడంతో రివర్స్ పంపింగ్‌కు అయిన విద్యుత్ చార్జీలు బూడిదలో పోసిన పన్నీరులా మారాయి. అధికారులు కన్నేపల్లి నుంచి ఎల్లంపల్లికి ఎత్తి పోసిన నీటిని తిరిగి గోదావరిలోకి విడుదల చేయడంతో విలువైన ధనం వృథా అయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దిశ ప్రతినిధి, కరీంనగర్ : అధికారులు అంచనా తప్పారు. ప్లాన్ అమలు చేయడంలో విఫలం కావడంతో రూ. 20 కోట్ల ప్రజాధనం గోదావరిలో కలిశాయి. ఆగస్టు మొదటి వారంలో కన్నెపల్లి పంప్‌హౌజ్ నుంచి నీటిని మిడ్ మానేరుకు తరలించాలనే నిర్ణయంతో పంపింగ్ కోసం వెచ్చించిన విద్యుత్ చార్జీలు మొత్తం వేస్ట్ అయ్యాయి. సుమారు 7.5 టీఎంసీల నీటిని ఎగువ ప్రాంతానికి తరలించాలని ఆదేశించడంతో కేవలం కరెంటు చార్జీల కోసం రూ.20 కోట్ల వరకు ఖర్చయిందని తెలుస్తోంది.

వెయిట్ చేయలే..

లింక్1 లోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అక్కడి నుంచి మిడ్‌మానేరుకు నీటిని తరలించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. 10 టీఎంసీల నీటిని తరలించాలని భావించి లిఫ్ట్ స్టార్ట్ చేశారు. క్రమంలో అల్పపీడన ప్రభావంతో భారీగా వర్షాలు కురిశాయి. దీంతో కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీటిని ఎత్తిపోసే ప్రక్రియను నిలిపివేశారు. వాస్తవంగా ఆగస్టు నెల ముగిసే వరకు ఎగువ గోదావరి నుంచి వరద రూపంలో నీరు వస్తుందని అంచనా వేశారు. ఈ కారణంగానే ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిని గణనీయంగా తగ్గించారు. వరద రూపంలో వచ్చే నీటిని లింక్ 1 కు తరలిస్తే కరెంటు చార్జీల మోత తగ్గుతుందని భావించిన అధికారులు చివరి క్షణంలో నీటిని ఎగువకు ఎత్తిపోసే ప్రక్రియను ప్రారంభించారు. దాదాపు 7.5 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసిన తరువాత భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలాల్సిన పరిస్థితి తయారైంది.

మళ్లీ గోదావరిలోకి..

అల్పపీడన ప్రభావంతో కరిసిన వర్షాలతో దాదాపు 30 టీఎంసీల నీటిని తిరిగి గోదావరిలోకి నీటిని వదిలారు. అప్పటికే కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి ఎల్లంపల్లికి తరలించిన నీరు కూడా మళ్లీ దిగువ ప్రాంతానికి పంపించాల్సి వచ్చింది. లింక్ 1, లింక్ 2 లకు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోయాలంటే విద్యుత్ కోసం రూ. 7 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఎల్లంపల్లి అక్కడి నుంచి కొంత మేర మిడ్‌మానేరుకు నీటిని తరలించడం వల్ల రూ.20 కోట్ల వరకు విద్యుత్ బిల్లుల మోత మోగినట్టు సమాచారం. అధికారులు ముందస్తుగా అంచనా వేసుకున్న ప్రకారం ఆగస్టు చివరి నాటికల్లా వేచి చూస్తే 20 కోట్ల రూపాయల భారం తగ్గేది.

Next Story

Most Viewed