AP Politics: ఐ ప్యాక్ చేయలేని పని.. ఆరా చేసింది!

by Indraja |
AP Politics: ఐ ప్యాక్ చేయలేని పని.. ఆరా చేసింది!
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఐ ప్యాక్ కూడా చేయలేని పనిని ఆరా సర్వే సంస్థ చేసేసింది. ఐ ప్యాక్‌ను పూర్తిగా నమ్మని వైసీపీ అభిమానులు ఆరా సంస్థ అధినేత మస్తాన్ మాటలు నమ్మి నిండా మునిగిపోయారు. ఈ పర్యాయం వైసీపీ అధికారంలోకి వస్తుందంటూ మొదటి నుంచి చెబుతున్న ఐ ప్యాక్‌ను, వైసీపీ అధినేతను బెట్టింగ్‌లు కాసే ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తొలుత పెద్దగా నమ్మలేదు.

కౌంటింగ్‌కు రెండు రోజుల ముందు ఆరా సంస్థ అధినేత మస్తాన్ వైసీపీనే అధికారంలోకి వచ్చితీరుతుందని కుండబద్దలు కొట్టడం ఇప్పుడు వైసీపీ నేతలు, అభిమానుల క్యాష్ బాక్స్‌‌లను బద్దలు చేసేసింది.

జగన్ సగం ముంచారు

పోలింగ్ అయిన రెండు రోజుల తరువాత విజయవాడ బెంజి సర్కిల్‌లో ఉన్న ఐ ప్యాక్ సంస్థకు వచ్చి ఉద్యోగులకు ధన్యవాదాలు చెప్పిన సందర్భంలో జగన్ మాట్లాడుతూ.. ఈ సారి గతంలో కంటే ఎక్కువగా 160 సీట్ల వరకూ వస్తాయని ప్రకటించారు. అప్పటి వరకూ వైసీపీ అధికారంలోకి వస్తుందని పెద్దగా నమ్మకం లేక బెట్టింగ్‌లలో పాల్గొనని వైసీపీ అభిమానులు అక్కడ జగన్ మాటలు విని, ఆ సమావేశంలో జగన్ ఉత్సాహం చూసి తిరిగి పందేలకు సిద్ధమయ్యారు. అప్పటికే లక్షకు రెండు లక్షల చొప్పున వైసీపీపై పందాలు జరుగుతుండడంతో వందల కోట్ల రూపాయలు పందాలు కాసేశారు.

ఆగిపోయిన ఆశలకు ఆరా ఆశలు

చివరకు లక్షకు రెండు లక్షలకు కూడా వైసీపీ నుంచి పందాలే కాసేవారు లేని సమయంలో ఆరా సంస్థ అధినేత మస్తాన్ ఒకటవ తేదీన సాయంత్రం మీడియా ముందుకు వచ్చి వైసీపీకి 94 నుంచి 104 మధ్య సీట్లు వస్తాయని గట్టిగా చెప్పారు. తన సర్వే అత్యంత శాస్ర్తీయమైనదని, వైసీపీ గెలవడం ఖాయమని కుండ బద్దలు కొట్టారు.

గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరా మస్తాన్ సర్వే ఫలితాలకు దగ్గరగా వుండడంతో నిజమే కావచ్చని జనం నమ్మారు. మిగిలిన వారు, జాతీయ ఛానల్స్ చెబుతున్నా వినకుండా తిరిగి పందాలకు సిద్ధమైపోయారు.

ఆరాను నమ్మి వేయి కోట్లకు పైగా..

ఆరా సంస్థ సర్వేను నమ్మి వైసీపీ అభిమానులు దేశవ్యాప్తంగా వేయి కోట్లకు పైగా పందాలు కాసి సర్వం కోల్పోయారు. అప్పటి వరకూ పందాలు లక్షకు రెండు లక్షల చొప్పున నడుస్తుండగా, ఆరా ఇచ్చిన ధైర్యంతో తిరిగి లక్షకు లక్ష చొప్పున చివరి రెండు రోజుల్లో కోట్లలో పందాలు కాశారు. ఫలితాలు దారుణంగా రావడంతో ఆరాతో తమ బతుకులు అగమ్యగోచరమై పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఆరా ప్రభావంతో పెద్ద ఎత్తున పందాలు జరిగాయని తెలిసింది.

డబ్బే కాదు, పొలాలు, స్థలాలు, వస్తువులు

పందేలు కాసేందుకు సరిపడనంత డబ్బు అందుబాటులో లేకపోవడంతో పలువురు పొలాలు, ఇళ్ల స్థలాలు చివరకు యంత్రాలు, వస్తువులను కూడా పందాలు కాశారు. ఇప్పుడు కాసిన పందాల ప్రకారం సెటిల్ మెంట్లు చేసుకొనేందుకు పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. కొందరు రైతులు చివరకు గేదెలను కూడా పందెంగా కాయడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed