Zelenskyy: ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని మోడీ ఆపగలడు.. జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు

by vinod kumar |
Zelenskyy: ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని మోడీ ఆపగలడు.. జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా-ఉక్రెయిన్(Russia Ukrein) యుద్ధాన్ని ఆపే సత్తా భారత ప్రధాని మోడీ(Pm modi)కి ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీ (Zelenskyy) అన్నారు. జనాభా, ఆర్థిక పరంగా మోడీ చాలా పెద్ద దేశానికి ప్రధాని అని తెలిపారు. తాజాగా ఆయన ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. వివాదానికి ముగింపు పలికేందుకు శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించడంలో మోడీ కీలకపాత్ర పోషిస్తారని చెప్పారు. ఉక్రెయిన్‌, రష్యాల మధ్య ప్రధాని మోడీ చర్చలు జరిపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. తదుపరి ఉక్రెయిన్ శాంతి శిఖరాగ్ర సమావేశాన్ని భారత్ లో నిర్వహించాలని కోరుకుంటున్నామని, మోడీ కావాలంటే దీనిని సమర్థవంతంగా చేపట్టొచ్చని తెలిపారు.

త్వరలో జరగబోయే యూఎస్(Us) అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్(Trump) గెలిస్తే తాము అమెరికా మద్దతు కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. సైనిక సహాయం నిలిచిపోతే ఉక్రెయిన్‌కు భారీ ఎదురుదెబ్బ తగులుతుందన్నారు. రష్యన్ సైనిక లక్ష్యాలను చేధించడానికి అమెరికా సరఫరా చేసిన సుదూర ఆయుధాలను ఉపయోగించడంలో ఉక్రెయిన్ ఇప్పటికే పరిమితులను ఎదుర్కొంటోందని గుర్తు చేశారు. శీతాకాలం రావడం, రష్యా ఉక్రేనియన్ ఇంధన మౌలిక సదుపాయాలను దెబ్బతీయడం కొనసాగిస్తున్నందున ఉక్రెయిన్ కొన్ని రోజులు చీకటిలో మగ్గే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇటీవల జరిగిన బ్రిక్స్(Brics) సదస్సుపై జెలెన్ స్కీ స్పందిస్తూ.. బ్రిక్స్ సమావేశం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి అనేక దేశాల నాయకులు హాజరయ్యారని, అయితే వారిలో ఎక్కువ మంది పుతిన్‌పై నమ్మకం లేనివారేనని తెలిపారు.

కాగా, ఇటీవల రష్యాలోని కజాన్ నగరం (kajan city)లో జరిగిన 16వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మోడీ ప్రస్తావించారు. శాంతియుత మార్గంలో మాత్రమే సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పారు. ఇందుకు గాను అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే జెలెన్ స్కీ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed