త్వరలో రాజస్థాన్‌లోనూ యూసీసీ అమలు: మంత్రి కన్హయ్య లాల్ చౌదరి కీలక వ్యాఖ్యలు

by samatah |
త్వరలో రాజస్థాన్‌లోనూ యూసీసీ అమలు: మంత్రి కన్హయ్య లాల్ చౌదరి కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ) బిల్లును ఉత్తరాఖండ్ ప్రభుత్వం మంగళవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ మంత్రి కన్హయ్య లాల్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లోనూ యూసీసీని త్వరలోనే అమలు చేస్తామని తెలిపారు. తదుపరి శాసనసభ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. మతంతో సంబంధం లేకుండా పౌరులందరూ ఒకే రకమైన చట్టాలను కలిగి ఉండాలనే ఉద్దేశంతో బిల్లును ప్రవేశపెట్టిన ఉత్తరాఖండ్ సీఎం ధామిపై ప్రశంసలు కురిపించారు. ‘ఉత్తరాఖండ్ తర్వాత యూసీసీ తీసుకొచ్చిన రెండో రాష్ట్రంగా రాజస్థాన్ ఉంటుంది. సీఎం దీనికి అనుకూలంగా ఉన్నారు. త్వరలోనే యూసీసీపై కార్యాచరణ మొదలు పెడతాం’ అని వెల్లడించారు. యూసీసీ దేశ ప్రజలకు ఎంతో అత్యవసరమైందని చెప్పారు. కాబట్టి వచ్చే అసెంబ్లీ సెషల్ లేదా తదుపరి సెషన్‌లో బిల్లును తీసుకొస్తామని స్పష్టం చేశారు. అయితే రాజస్థాన్ అసెంబ్లీ ప్రస్తుత సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది కాబట్టి, యూసీసీని ప్రవేశపెట్టే అవకాశం లేదు. మరోవైపు యూసీసీ బిల్లును సరైన సమయంలో ప్రవేశపెడతామని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు.



Next Story