Terrorist Attack: ఉగ్రవాదులు జైలుకు లేదా నరకానికి.. కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ వార్నింగ్

by vinod kumar |   ( Updated:2024-07-24 12:11:45.0  )
Terrorist Attack: ఉగ్రవాదులు జైలుకు లేదా నరకానికి.. కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లో ఇటీవల జరుగుతున్న ఉగ్రదాడుల నేపథ్యంలో కేంద్ర సహాయ మంత్రి నిత్యనందరాయ్ స్పందించారు. టెర్రరిజాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. ఆక్టివ్‌గా పనిచేస్తున్న ఉగ్రవాదులను జైలుకు లేదా నరకానికి పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు నిత్యానందరాయ్ బదులిచ్చారు. ఇటీవల చోటు చేసుకున్న ఉగ్రవాద కార్యకలాపాలు త్వరలో ముగుస్తాయని తెలిపారు. గత కొద్దిరోజులుగా జమ్మూ కశ్మీర్‌లో 28 మంది ఉగ్రవాదులు హతం కాగా..కొందరు భద్రతా సిబ్బంది సైతం ప్రాణాలు కోల్పోయారని ఇది చాలా దురదృష్టకరమన్నారు. త్వరలోనే ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేస్తామని దీమా వ్యక్తం చేశారు.

యూపీఏ హయాంలో జమ్మూకశ్మీర్‌లో 7,217గా ఉన్న ఉగ్రవాద ఘటనలు ఈ ఏడాది జూలై నాటికి 2259కి తగ్గాయని చెప్పారు. ప్రతిపక్షాలు ఈ ఘటనలను రాజకీయం చేస్తున్నాయని, అది సరైంది కాదని తెలిపారు. 2004, 2014 మధ్య 2,829 మంది పౌరులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. 2014 నుంచి ఈ సంఖ్య 67 శాతం తగ్గిందని గుర్తు చేశారు. అంతేగాక ఉగ్రవాద సంఘటనలు కూడా 69 శాతం తగ్గాయన్నారు. 2023లో 2 కోట్ల 11 వేల మంది పర్యాటకులు కశ్మీర్‌ను సందర్శించారని, అక్కడ శాంతి నెలకొంది కాబట్టే పర్యాటకులు పెరుగుతున్నారని చెప్పారు.

Advertisement

Next Story