మహరాష్ట్రలో రెండు శివసేనల మధ్య హోరాహోరీ

by S Gopi |
మహరాష్ట్రలో రెండు శివసేనల మధ్య హోరాహోరీ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశమంతా లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై దృష్టి సారించిన నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో ఈసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా మహారాష్ట్రలో స్థానిక శివసేన, శివసేన(యూబీటీ) పార్టీల మధ్య పోరు అత్యంత హోరాహోరీని తలపిస్తోంది. రాష్ట్రంలోని 13 స్థానాల్లో రెండు శివసేన పార్టీలు నేరుగా తలపడ్డాయి. తాజాగా వెలువడిన ఎగ్జిట్‌పోల్స్‌లో ఇరు వర్గాలు సమాన బలాన్ని కలిగి ఉన్నాయని స్పష్టమైంది. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం.. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గం ఐదు సీట్లను గెలిచే అవకాశం ఉంది. ఉద్ధవ్ ఠాక్రే వర్గం శివసేన(యూబీటీ) మూడు సీట్లలో గెలుపును దక్కించుకోనుంది. మిగిలిన ఐదు స్థానాల్లో హోరాహోరీగా పోరు ఉంటుందని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.

2022లో ఏక్‌నాథ్ షిండే, 40 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయడం ద్వారా శివసేనలో చీలిక వచ్చింది. దాంతో ఈ లోక్‌సభ ఎన్నికలు రెండు వర్గాల మధ్య ఎంతమేరకు ప్రజాదరణ ఉందనే అంశాన్ని పరీక్షించే మొదటి పెద్ద ఎన్నికలుగా మారాయి. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో శివసేన 15 స్థానాల్లో, శివసేన(యూబీటీ) 21 స్థానాల్లో పోటీ చేశాయి. ఒక వర్గానికి సంఖ్య ఎక్కువగా ఉండగా, మరో వర్గానికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓట్లు సాధించే సత్తా ఉంది. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ ప్రకారం, ఏక్‌నాథ్ షిండే వర్గం 8-10 సీట్లను గెలవొచ్చు. శివసేన(యూబీటీ) 9-11 సీట్లను సాధించవచ్చు. ఓట్ల పరంగా చూస్తే ఏక్‌నాథ్ షిండే 13 శాతం ఓట్లను, మరొక వర్గం 20 శాతం ఓట్లను కలిగి ఉండనుంది.

ఏక్‌నాథ్ షిండే వర్గం హింగోలి, షిర్డీ, కళ్యాణ్, థానె, భుల్దానా నియోజకవర్గాల్లో విజయం సాధించనుండగా, దక్షిణ ముంబై, నాసిక్, మావల్ స్థానాల్లో గెలుపొందనుంది. యవత్మాల్, శంభాజీ నగర్, నార్త్‌వెస్ట్ ముంబై, హత్కనంగలే, సౌత్ సెంట్రల్ ముంబై చోట్ల ఇరు వర్గాల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. ఈ ఐదు స్థానాల్లో షిండే సేన యవత్మాల్, శంభాజీ నగర్, నార్త్‌వెస్ట్ ముంబై స్థానాల్లో బలంగా ఉంది. హత్కనంగలే సీటులో శివసేన(యూబీటీ) బలంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల వెనుక అనేక అంశాలు పనిచేస్తున్నాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ప్రధాని మోడీ శివసేన అభ్యర్థులు బలహీనంగా ఉన్న చోట్లలో పలు ర్యాలీలు నిర్వహించారు. ఇది వారికి అనుకూలంగా పనిచేయవచ్చు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ జరిగిన తర్వాతే ఏ వర్గం, ఎంత మంది అభ్యర్థులు గెలుస్తారనే దాన్ని బట్టి వారి భవిష్యత్తును నిర్ణయమవుతుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story