Vande Bharat Train: ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై వందేభారత్ తొలి ట్రయల్ రన్

by Shamantha N |
Vande Bharat Train: ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై వందేభారత్ తొలి ట్రయల్ రన్
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనపై వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు Vande Bharat Train) తొలి ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయ్యింది. సంవత్సరాల కృషి, అంకితభావం, ఇంజనీరింగ్ అద్భుతాలతో అత్యంత శీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేకంగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుని రూపొందించారు. శనివారం దాని ట్రయర్ రన్ పూర్తయ్యింది. చీనాబ్ నదిపై(Chenab Rail Bridge) నిర్మించిన అత్యంత ఎత్తైన వంతెనపై వందేభారత్ రైలు పరుగులు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కాగా.. కాత్రాలోని మాతా వైష్ణోదేవి రైల్వేస్టేషన్‌ నుంచి శ్రీనగర్‌కు ప్రయాణికులను తీసుకుని వెళ్లింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 11:30 గంటలకు స్టేషన్‌కు చేరుకోగానే.. భారత్ మాతీకు జై అనే నినాదాలు చేశారు. ఆ తర్వాత భారతీయ రైల్వేలను ప్రశంసిస్తూ రైలుకి స్వాగతం తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో లోయ ప్రాంతాలు ఉండటంతో.. ఇంతకుముందు రైల్వే కనెక్టివిటీ అంతగా లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉధంపుర్‌- శ్రీనగర్‌- బారాముల్లా రైల్‌ లింక్‌ ప్రాజెక్టును పూర్తి చేసింది. ఇందులో భాగంగానే దేశంలో తొలిసారిగా కేబుల్‌ రైలు వంతెనను నిర్మించారు. నదీ ఉపరితలనికి 331 మీటర్ల ఎత్తులో ఇది ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న వంతెనను చీనాబ్‌ నదిపై నిర్మించారు. ఈ చీనాబ్‌ వంతెనపైనా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రయాణించింది.

రైలు ప్రత్యేకతలు

కాత్రాలో రైలును ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. కాత్రా నుంచి బారాముల్లా మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రాకపోకలు సాగించనుంది. అయితే, ఎప్పుడు రైలుని ప్రారంభించే తేదీ మాత్రం తెలియాల్సి ఉంది. మరోవైపు, భారతీయ రైల్వేలు ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (USBRL) ప్రాజెక్టులో 272 కిలోమీటర్లను పూర్తి చేశాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే నడుస్తున్న 136 వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌తో పోలిస్తే వందే భారత్ రైలులో ఎన్నో అదనపు ఫీచర్లు ఉన్నాయి. సున్నా డిగ్రీల అతిశీతల వాతావరణం తట్టుకునేలా నీరు, బయో టాయిలెట్లు గడ్డకట్టకుండా ఉండేందుకు అధునాతన ఉష్ణ వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేశారు. సబ్-జీరో ఉష్ణోగ్రతలలో కూడా సజావుగా పనిచేయడానికి అడ్వాన్స్ డ్ ఎయిర్-బ్రేక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. వాక్యూమ్‌ వ్యవస్థకు వేడి గాలిని సరఫరా చేస్తుంది.మంచు కురిసే సమయంలో లోకో పైలట్‌కు ముందున్నవి కన్పించేందుకు వీలుగానూ ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఈ రైలు రాకతో కశ్మీర్‌ లోయలో రైల్వే అనుసంధానత మెరుగుపడి జమ్ముకశ్మీర్‌ను భారత రైల్వే నెట్వర్క్కు కనెక్ట్‌ చేయడం సులభతరం అయిందని అధికారులు తెలిపారు.

Next Story